Medical Student Preethi | కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసు కొత్త మలుపు తీసుకుంది. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక అనస్థీషియా ఓవర్ డోస్ తీసుకుని ప్రీతి బలవన్మరణానికి పాల్పడిందని అంతా భావించారు. పోలీసుల దర్యాప్తులో కూడా ఇదే తేలింది. ఎంజీఎం ఆస్పత్రిలో ప్రీతి అపస్మారక స్థితిలో పడి ఉన్న చోట మిడాజోలం, పెంటానోల్ మత్తు ఇంజెక్షన్ వయల్స్ పోలీసులకు లభించాయి. దీంతో ప్రీతిది ఆత్మహత్యే అని నిర్ధారించారు. కానీ టాక్సీకాలజీ రిపోర్టులో అది తప్పు అని వెల్లడైంది. ప్రీతి శరీరంలో ఎటువంటి విషపు రసాయనాలు లేవని తెలిసింది.
ఇటీవల ప్రీతి మృతికి మిడాజోలం, పెంటానోల్ కారణమా? ఇంకా ఏమైనా విష రసాయనాలు కారణమా అనే విషయం తెలుసుకునేందుకు టాక్సీకాలజీ పరీక్ష కోసం శాంపిల్స్ను హైదరాబాద్కు పంపించారు. పది రోజుల తర్వాత ఇప్పుడు టాక్సీకాలజీ రిపోర్టు వచ్చింది. ఆ నివేదిక ఆదివారం నాడు వరంగల్ పోలీసులకు చేరింది. అయితే అందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ప్రీతి శరీరంలో ఆ ఇంజెక్షన్లకు సంబంధించిన అవశేషాలు ఏవీ కనిపించలేదని నివేదికలో పేర్కొన్నారు. దీంతో ప్రీతిది ఆత్మహత్యనా? లేదా ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు హత్యా? అనేది తేలని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ టాక్సీకాలజీ రిపోర్టు ఆధారంగా ప్రీతి ఆత్మహత్య కేసును అనుమానాస్పద కేసుగా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన సైఫ్ ఫోన్ కాల్ డేటాపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఫిబ్రవరి 22 కంటే ముందు రెండు రోజులకు సంబంధించిన కాల్ డేటాను పోలీసులు సేకరించారు. దీనిపై ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సైఫ్ను ఏసీపీ కార్యాలయంలో విచారించారు.