Siddipet Accident | తీర్థయాత్రకు వెళ్లిన కుటుంబానికి అదే అంతిమ యాత్రగా మారింది. దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ప్రమాదవశాత్తూ కారు గుంతలో పడిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడప వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. భువనగిరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వేములవాడ వెళ్లారు. దర్శనం అనంతరం మంగళవారం ఉదయం కారులో తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. తొందరగా వెళ్లేందుకు సిద్దిపేట దాటిన తర్వాత కొండపాక దగ్గర షార్ట్కట్ తీసుకున్నారు. అయితే జగదేవ్పూర్ మండలం మునిగడప దగ్గర రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీన్ని గమనించకపోవడంతో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్ట్ను ఢీకొట్టింది. పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. గుంతలో నీళ్లు ఉండటంతో అందులో మునిగి అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులను సత్తెమ్మ, స్రవంతి, లోకేశ్, భవ్యశ్రీ, రాజమణిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ అనే వ్యక్తిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు.
Follow Us : Google News, Facebook, Twitter