Diabetes | మధుమేహం అనగానే ప్రతిఒక్కరిలో భయం పెరిగిపోతుంది. వణికిపోతారు. కానీ మనం
తినే ఆహారంలో చిన్న మార్పులు చేసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం, వైద్యల సలహాలు పాటిస్తే సులువుగా మధుమేహాన్ని జయించొచ్చు అని అంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ?
మధుమేహం వ్యాధిగ్రస్తులు శాకాహార పదార్థాలే తినడం మంచింది. మాంసాహారానికి వీలైనంత
వరకు దూరంగా ఉంటేనే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి అవసరం అయ్యే
ప్రోటీన్లు మాంసాహారంలోనే ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ శాఖాహారంలోనూ
ఈ ప్రోటీన్లు లభిస్తాయి. ఇవే శరీరానికి మంచివి. ఎందుకంటే మాంసాహారంలో ప్రోటీన్లతో పాటు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఇది గుండెకు మంచిది కాదు.
కాజు, బాదం, చేపలు బెస్ట్
సాధారణంగా శాఖాహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.
తాజా ఆకుకూరలు, పండ్లు, గోధుమ, మొక్కజొన్న, రాగులు, సజ్జల వంటివాటితో పాటు కాజు,
బాదం, చేపలను తీసుకోవాలి. వీటిద్వారా శరీరానికి సరిపడా విటమిన్లు అందుతాయి.
వీటికి దూరంగా ఉండాలి
ముఖ్యంగా మధుమేహం ఉన్నవాళ్లు చక్కెర శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను
తీసుకోవద్దు. కర్జూర, సపోటా, బత్తాయి, ద్రాక్ష, పైనాపిల్, బీట్రూట్, ఆలుగడ్డ, అరటిలో చక్కెర
శాతం ఎక్కువగా ఉంటుంది. వీటికి బదులుగా చక్కెర శాతం తక్కువగా ఉండే యాపిల్స్,
జామపండ్లు, దానిమ్మ, ఆఫ్రికాట్లను తీసుకోవాలి. తేనె, జామ్, సాఫ్ట్ డ్రింక్స్ లాంటి వాటిని కూడా
పూర్తిగా తగ్గించాలి.
వ్యాయామం మస్ట్
మధుమేహం ఉన్నవాళ్లు కచ్చితంగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. రోజూ గంటకు పైగా
వాకింగ్, సైక్లింగ్ , జాగింగ్ చేయడం వల్ల బరువు అదుపులో ఉండటంతో పాటు ఎముకలు,
కండరాలు బలంగా తయారవుతాయి. శరీరానికి శ్రమ ఏర్పడితే కొలెస్ట్రాల్ తగ్గి.. యాక్టివ్గా
తయారవుతారు. సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే పౌష్టికాహారంతో పాటు శారీరక శ్రమ రెండూ
అవసరమే.
మెంతులు భేష్..
మన పూర్వీకులు మెంతులను ఎక్కువగా ఆహార పదార్థాల్లో ఉపయోగించేవారు. వాటికి ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. ముఖ్యంగా మెంతులను ఉడికించి.. దాని రసాన్ని తాగటం వల్ల రక్తంలో ఉన్న చక్కెర శాతం తగ్గుతుంది. మధ్యాహ్నం భోజనానికి ముందు, రాత్రి భోజనానికి ముందు నీటిలో కానీ పౌడర్ రూపంలో మజ్జిగలో కలుపుకొని తాగాలి.