Home Latest News WPL 2023 Final | ముంబైదే మహిళల టైటిల్‌.. డబ్ల్యూపీఎల్‌ ఫైనల్లో ఢిల్లీపై జయకేతనం

WPL 2023 Final | ముంబైదే మహిళల టైటిల్‌.. డబ్ల్యూపీఎల్‌ ఫైనల్లో ఢిల్లీపై జయకేతనం

WPL 2023 Final | టైమ్‌ 2 న్యూస్‌, ముంబై: సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన ముంబై ఇండియన్స్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) తొలి టైటిల్‌ కైవసం చేసుకుంది. చివరి ఓవర్‌ వరకు హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఢిల్లీని చిత్తుచేసిన ముంబై సగర్వంగా ట్రోఫీ అందుకుంది. పురుషుల ఐపీఎల్లో ఐదు ట్రోఫీలు చేజిక్కించుకొని మరే జట్టుకు అందనంత ఎత్తులో ఉన్న ముంబై ఇండియన్స్‌.. మహిళల లీగ్‌లో బోణీ కొట్టింది. సీజన్‌ ఆరంభం నుంచి నిలకడగా రాణించిన ముంబై ఇండియన్స్‌ జట్టు.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి టైటిల్‌ చేజిక్కించుకుంది. ఆదివారం ఇక్కడి బ్రబౌర్న్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసింది.

మాథ్యూస్‌ మ్యాజిక్‌ స్పెల్‌

లీగ్‌ ప్రారంభమైనప్పటి నుంచే భారీ అంచనాల భారాన్ని మోసిన ముంబై ఇండియన్స్‌ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. గ్రూప్‌ దశలో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింట నెగ్గడంతో పాటు.. ఎలిమినేటర్‌లో యూపీ వారియర్స్‌పై ఘనవిజయం ఖాతాలో వేసుకొని ఫైనల్‌ చేరిన ముంబై.. తుది మెట్టుపై దుమ్మురేపింది. ఆదివారం ప్రేక్షకులతో కిక్కిరిసిన బ్రబౌర్న్‌ మైదానంలో అతిరథ మహారథుల సమక్షంలో సాగిన టైటిల్‌ ఫైట్‌లో ముంబై ఆకట్టుకుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (35; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా.. చివర్లో శిఖ పాండే (17 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌), రాధ యాదవ్‌ (12 బంతుల్లో 27 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విలువైన పరుగులు జోడించారు. ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్‌ నాలుగు ఓవర్లలో రెండు మెయిడిన్లు వేసి ఐదు పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టగా.. ఇస్సీ వాంగ్‌ 3, అమెలియా కెర్ర్‌ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.

స్కీవర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌..

చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెతను ఒంటబట్టించుకున్న ముంబై.. ఛేదనలో ఏమాత్రం తొందరపడలేదు. టార్గెట్‌ పెద్దదికాకపోయినా.. చివరి వరకు సంయమనంతో ఆడుతూ ఒక్కో పరుగు జోడించింది. ఫలితంగా.. ముంబై ఇండియన్స్‌ 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. స్కీవర్‌ బ్రంట్‌ (55 బంతుల్లో 60 నాటౌట్‌; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో రాణించగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (37; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. ఢిల్లీ బౌలర్లలో రాధ యాదవ్‌, జెస్‌ జాన్సెన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఒక దశలో ముంబై విజయానికి 12 బంతుల్లో 21 పరుగులు అవసరం కాగా.. ముంబై ఏమాత్రం ఇబ్బంది పడలేదు. స్కీవర్‌ ఒక ఫోర్‌, అమెలియా కెర్ర్‌ రెండు ఫోర్లు బాదడంతో 19వ ఓవర్లో 16 పరుగులు రావడంతోనే మ్యాచ్‌ ముంబై వైపు మొగ్గుచూపింది. ఇక చివరి ఓవర్‌లో విజయానికి 5 పరుగులు అవసరం కాగా.. మూడో బంతికి బౌండ్రీ బాదిన స్కీవర్‌ లాంఛనం పూర్తి చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nikhat Zareen | మేరీ కామ్‌ రికార్డు సమం చేసిన తెలంగాణ బిడ్డ.. బాక్సింగ్‌లో వరుసగా రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిఖత్‌

WPL Champion | చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. తొలి WPL విజేతగా రికార్డు

Exit mobile version