Hockey World Cup | ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంతో ప్రపంచ హాకీని శాసించిన భారత జట్టు.. పూర్వవైభవం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. శుక్రవారం నుంచి స్వదేశంలో హాకీ వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా తొలి పోరులో స్పెయిన్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
1971లో ఈ మెగాటోర్నీని ప్రవేశ పెట్టగా తొలి ప్రయత్నంలో మనవాళ్లు కాంస్య పతకం సాధించారు. అప్పటికి దేశంలో క్రికెట్ ఫీవర్ అంతగా లేకపోగా.. ఆ తర్వాతి (1973) వరల్డ్కప్లో మనవాళ్లు మరింత మెరుగైన ప్రదర్శన చేస్తూ రజతం కైవసం చేసుకున్నారు. మరుసటి ప్రపంచకప్ (1975)లో స్వర్ణం నెగ్గిన టీమ్ఇండియా.. ఆ తర్వాత 48 ఏండ్లుగా ఒక్కసారి కూడా పతకం దరిదాపుల్లోకి చేరలేకపోయింది.
స్వదేశంలోనే జరిగిన గత ఎడిషన్లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 1978 నుంచి 2014 వరకు భారత జట్టు కనీసం గ్రూప్ దశను కూడా దాటలేకపోయిందంటే హాకీలో మన ప్రమాణాలు ఏ స్థాయికి పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవలి కాలంలో అనధికారిక జాతీయ క్రీడకు తిరిగి మంచి గుర్తింపు లభిస్తున్నది. టోక్యో (2020) ఒలింపిక్స్లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. కాంస్య పతకం కైవసం చేసుకొని దేశవ్యాప్తంగా హాకీకి పునరుత్తేజాన్ని అందించింది. ఆ తర్వాత కామన్వెల్త్లోనూ సత్తా చాటిన మనవాళ్లు పసిడి పతకంతో ఫుల్ జోష్లోకి వచ్చారు.
ఇప్పుడదే ఊపులో సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్లో దుమ్మురేపేందుకు టీమిండియా సిద్ధమైంది.
1983 వన్డే ప్రపంచకప్ దేశంలో క్రికెట్కు ఎలాంటి క్రేజ్ తీసుకొచ్చిందో.. టోక్యో ఒలింపిక్స్ పతకం భారత హాకీ జట్టులో నూతన జవసత్వాలు నింపింది. గ్రహమ్ రీడ్ శిక్షణలో ప్రపంచ స్థాయి జట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా దినదినాభివృద్ధి చెందుతున్న టీమిండియా.. స్వదేశంలో ప్రపంచకప్ ముద్దాడాలని ప్రతి అభిమాని కోరకుంటున్నాడు. 16 జట్లు పాల్గొనే ఈ మెగాటోర్నీ ఆరంభం వేడుకలు ఇప్పటికే (బుధవారం) పూర్తి కాగా.. ఇక శుక్రవారం నుంచి మైదానంలో ఆటగాళ్ల విన్యాసాలు కన్నులవిందు చేయనున్నాయి.
ప్రపంచకప్ నెగ్గితో ఒక్కో ఆటగాడికి కోటి రూపాయలు
స్పెయిన్, ఇంగ్లండ్, వేల్స్తో కలిసి గ్రూప్-‘డి’ బరిలో ఉన్న భారత్.. నాకౌట్ చేరడమే తొలి లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. హాకీకి అధికారిక స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం.. ప్రపంచకప్ నెగ్గితే ఒక్కో ఆటగాడికి కోటి రూపాయల నజరాన ఇవ్వనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం మొదటి పోరులో స్పెయిన్తో తలపడనున్న టీమిండియా.. అనుభజ్ఞులు, యువ ఆటగాళ్లతో సమతూకంగా కనిపిస్తోంది. టోక్యో ఒలింపిక్స్లో జట్టును ముందుండి నడిపించిన మన్ప్రీత్ సింగ్ ఈ సారి సీనియర్ ప్లేయర్గా బరిలోకి దిగుతుండగా.. హర్మన్ప్రీత్ సింగ్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. వీరిద్దరితో పాటు గోల్ పోస్ట్ వద్ద అడ్డుగోడలా నిలిచే గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్, హార్దిక్ సింగ్, మన్దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, నీలకంఠ, అమిత్ రొహిదాస్ సమష్టిగా రాణిస్తే భారత్కు తిరుగుండదు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
India Vs Sri Lanka | భారత్పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. తుది జట్టులో ఎవరున్నారు?
India Vs Srilanka | శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సచిన్ రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ