Vijay devarakonda | టైమ్ 2 న్యూస్, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్లో అదరగొడుతున్న హైదరాబాద్ బ్లాక్హాక్స్ జట్టుతో ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ జట్టు కట్టాడు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ రెండో సీజన్లో విజయ్ దేవరకొండ.. బ్లాక్హాక్స్ సహయజమానిగానూ కొనసాగుతాడని.. బ్లాక్హాక్స్ ఓనర్ కనకాల అభిషేక్ రెడ్డి తెలిపాడు. విజయ్ దేవరకొండ రాకతో జట్టులో నూతనోత్సాహం వచ్చిందని అభిషేక్ పేర్కొన్నాడు. తొలి సీజన్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన బ్లాక్హాక్స్.. రానున్న సీజన్లో మరింత మెరుగైన ఆటతీరు కనబర్చడం పక్కా అని ధీమా వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఈ అవకాశం రావడం ఆనందంగా ఉంది. బ్లాక్హాక్స్ కేవలం స్పోర్ట్స్ టీమ్ మాత్రమే కాదు.. అంతకుమించి! జాతీయ స్థాయిలో తెలుగు ఘన వారాసత్వాన్ని చాటాలనుకుంటున్నాం. బ్రాండ్ను ప్రజలకు మరింత చేరువ చేయడంలో నా వంతు కృషి చేస్తా’ అని అన్నాడు. ప్రతి గ్రామంలో కనిపించే వాలీబాల్ క్రీడకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను జోడిస్తూ సాగుతున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్లో బ్లాక్హాక్స్ మంచి ప్రదర్శన కనబరుస్తుందని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. నగరాలతో పాటు మారుమూల పల్లెలకు క్రీడలను పరిచయం చేయడం కోసమే బ్లాక్హాక్స్తో జట్టు కట్టినట్లు పేర్కొన్నాడు. దీన్ని కేవలం ఒక క్రీడగానే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితేసే ఒక సాధనంగా చూస్తున్నామని చెప్పుకొచ్చాడు.
తొలి సీజన్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఇంగ్లిష్, హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో ప్రసారమైంది. అన్నీ మ్యాచ్లు కలిపి మొత్తం మీద 41 మిలియన్ టెలివిజన్ వ్యూయర్షిప్ నమోదు చేశాయి అని అభిషేక్ రెడ్డి చెప్పారు. లీగ్ రెండో సీజన్ ఫిబ్రవరి 4 నుంచి మార్చి 5 వరకు కొనసాగనుంది. మొత్తం 31 మ్యాచ్లు నిర్వహించనున్నారు.