T20 world cup | టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా వేదికగా శ్రీలంక, నమీబియా జట్లు తలపడ్డాయి. ఇటీవలే ఆసియా కప్ గెలిచిన శ్రీలంక.. పసి కూన నమీబియా చేతిలో ఘోర పరాజయం పాలైంది. ప్రపంచకప్లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన నమీబియా తొలిమ్యాచ్లోనే సమిష్టిగా రాణించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు చేసిన నమీబియా.. శ్రీలంకపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ 44 పరుగులు చేయగా.. జేజే స్మిత్ 31 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్కు 34 బంతుల్లో 70 పరుగులు జోడించి శ్రీలంకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలకంగా వ్యవహరించారు.
నమీబియా ఇచ్చిన భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో శ్రీలంక ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మొదటి 21 బంతుల్లోనే పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, దనుష్క గుణతిలక పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భానుక రాజపక్సే, దసున్ షనక రాణించారు కానీ ఫలితం లేకుండా పోయింది. నమీబియా బౌలర్లు బెర్నాల్డ్ స్కోల్ట్జ్, బెర్ షికోంగో, జాన్ ఫ్రైలింక్, వైస్ తలో రెండు వికెట్లు తీసి.. 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ చేశారు.