India Vs Sri Lanka | సొంతగడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత క్రికెట్ జట్టు మరో సిరీస్ ఖాతాలో వేసుకుంది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ను 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే హస్తగతం చేసుకుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
గువాహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో టాపార్డర్ దుమ్మురేపితే.. తాజా పోరులో మిడిలార్డర్ సత్తాచాటింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్ర ఆటగాడు నువనిండు ఫెర్నాండో (50; 6 ఫోర్లు) అర్ధశతకంతో అలరించగా.. కుషాల్ మెండిస్ (34), దునిత్ (32) ఫర్వాలేదనిపించారు. గత మ్యాచ్లో అజేయ శతకంతో జట్టును గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేసిన కెప్టెన్ దసున్ షనక (2) ఎదుర్కొన్న నాలుగో బంతికే ఔట్ కావడం లంక విజయావకాశాలను దెబ్బతీసింది.
భారత బౌలర్లలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
రాహుల్ అజేయ అర్ధశతకం
అనంతరం సాధారణ లక్ష్యఛేదనను టీమిండియా ఆడుతూ పాడుతూ ముగించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (17), శుభ్మన్ గిల్ (21) ఎక్కువ సేపు నిలువకపోయినా.. మిడిలార్డర్లో లోకేశ్ రాహుల్ (64 నాటౌట్; 6 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (36), శ్రేయస్ అయ్యర్ (28) రాణించారు. గత పోరులో శతక్కొట్టిన విరాట్ కోహ్లీ (4) కోల్కతాలో అదే జోరు కొనసాగించలేకోయాడు.
లంక బౌలర్లలో లహిరు కుమార, చమిక కరుణరత్నె చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లంకపై అమోఘమైన రికార్డు ఉన్న హిట్మ్యాన్ రోహిత్ శర్మ.. ఇన్నింగ్స్ ఆరంభంలో తన ధాటి కొనసాగించడంతో భారత్ విజయం నల్లేరుమీద నడకే అనిపించింది. అయితే రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టిన అనంతరం రోహిత్ ఐదో ఓవర్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డబుల్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ను తోసిరాజని.. తుది జట్టులో చోటు దక్కించుకున్న శుభ్మన్ గిల్ కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. అదుకుంటాడనుకున్న విరాట్ బంతిని వికెట్ల మీదకు ఆడుకోగా.. ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్కు ఇరుసులా నిలబడి మ్యాచ్ను ముగించాడు.
62 పరుగులకే టాప్-3 బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో ఆరంభంలో ఆచితూచి ఆడిన రాహుల్.. శ్రేయస్ అయ్యర్తో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించాడు. అయితే కుదురుకున్నట్లే కనిపించిన శ్రేయస్ వికెట్ల ముందు దొరికిపోగా.. ఆ తర్వాత పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. రాహుల్కు అండగా నిలిచాడు. సాధించాల్సిన రన్రేట్ ఎక్కువ లేకపోవడంతో ఒక్కో పరుగు చేస్తూ ముందుకు సాగిన ఈ జంట జట్టును విజయానికి చేరువ చేయగా.. ఆఖర్లో అక్షర్ పటేల్ (21) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్లు నెగగి ట్రోఫీ కైవసం చేసుకున్న రోహిత్ సేన.. ఆదివారం తిరువనంతపురంలో మూడో వన్డే ఆడనుంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
India Vs Sri Lanka | భారత్పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. తుది జట్టులో ఎవరున్నారు?
India Vs Srilanka | శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సచిన్ రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ