Women’s IPL | ఎట్టకేలకు మహిళల క్రికెట్లో మరో అంకం మొదలైంది. ఇప్పటివరకు పురుషులకే ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) ఇప్పుడు మహిళలకు కూడా వచ్చింది. రావడం రావడమే రికార్డులు సృష్టించింది. 2008లో పురుషుల ఐపీఎల్ మొదలైనప్పుడు వచ్చిన బిడ్ల కంటే కూడా.. మహిళల ఐపీఎల్కు భారీగా ఆదాయం వచ్చింది. దీన్ని బట్టే మహిళల ఐపీఎల్కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
మహిళల ఐపీఎల్కు సంబంధించిన లీగ్ పేరుతో పాటు ఫ్రాంచైజీల వివరాలను బుధవారం బీసీసీఐ ప్రకటించింది. దీనికి విమెన్స్ ప్రీమియర్ లీగ్ ( WPL) అని పేరు పెట్టినట్లు తెలిపింది. దీంతో పాటు ఐదు ఫ్రాంచైజీల వివరాలను కూడా వెల్లడించింది. ఈ ఐదు ఫ్రాంచైజీలకు వేలం నిర్వహించగా.. రూ.4,669.99 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. అంతేకాదు 2008లో ప్రారంభమైన పురుషుల ఐపీఎల్ బిడ్ కంటే కూడా ఇది చాలా ఎక్కువ అని ప్రకటించారు.
ఈ ఫ్రాంచైజీలను దక్కించుకునేందుకు దాదాపు 30కి పైగా బడా కార్పొరేట్ కంపెనీలు పోటీపడ్డాయి. కానీ చివరకు ఐదు మాత్రమే ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. వీటిలో అదానీ, అంబానీ కంపెనీలు కూడా పోటీపడి.. చివరకు తమకు కావాల్సిన ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. అహ్మదాబాద్ జట్టును హస్తగతం చేసుకునేందుకు అదానీ గ్రూప్నకు చెందని అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేటు లిమిటెడ్ అత్యధికంగా రూ.1,289 కోట్లు వెచ్చించింది. డబ్ల్యూపీఎల్లోని ఐదు ఫ్రాంచైజీల్లో అత్యధికంగా ధర పలికిన జట్టు ఇదే కావడం విశేషం. ఇక అత్యధిక ధర పలికిన ఫ్రాంచైజీల్లో రెండో స్థానంలో ముంబై నిలిచింది. దీన్ని రిలయన్స్ సంస్థలో భాగమైన ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సొంతం చేసుకుంది. దీనికోసం రూ.912.99 కోట్లు ఖర్చు పెట్టింది. రాయల్ ఛాలెంజర్స్ గ్రూప్నకు చెందిన రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ బెంగళూరు ఫ్రాంచైజీని రూ.901 కోట్లకు, ఢిల్లీ ఫ్రాంచైజీని జేఎస్డబ్ల్యూ గ్రూపులోని జేఎస్డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేటు లిమిటెడ్ రూ.810 కోట్లకు దక్కించుకున్నాయి. పురుషుల ఐపీఎల్తో సంబంధం లేకుండా డబ్ల్యూపీఎల్లోకి క్యాప్రీ గ్లోబల్ సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ఇది లక్నో ఫ్రాంచైజీని రూ.757 కోట్లకు చేజిక్కించుకుంది.