Bruce Lee Death Mystery | మార్షల్ ఆర్ట్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది బ్రూస్లీ. ఒక సంచలనంగా వెలుగులోకి వచ్చిన బ్రూస్లీ.. అంతే త్వరగా అంతర్ధానమైపోయాడు. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆ మార్షల్ ఆర్ట్స్ కింగ్.. కేవలం 32 ఏళ్ల వయసులోనే అర్ధాంతరంగా కన్నుమూశాడు. అయితే బ్రూస్లీ ఎలా చనిపోయాడు? అతని మరణానికి కారణమేంటి? బ్రూస్లీది సహజ మరణమా? మరేదైనా కారణాలు ఉన్నాయా? అని ఎన్నో అనుమానాలు అప్పట్లో తెర మీదకు వచ్చాయి. కానీ ఇప్పటికీ అది మిస్టరీగానే మిగిలిపోయింది. బ్రూస్లీ మరణించిన దాదాపు 52 ఏళ్ల తర్వాత బ్రూస్లీ మరణానికి ఇదే కారణమంటూ ఒక వాదన తెరమీదకు వచ్చింది.
బ్రూస్లీ 1973లో జూలైలో కన్నుమూశాడు. ఆ సమయంలో బ్రూస్లీని పరీక్షించిన వైద్యులు.. సెరెబ్రల్ ఎడిమా అనే వ్యాధితో మరణించాడని పేర్కొన్నారు. సెరెబ్రల్ ఎడిమా అంటే మెదడు వాపు వ్యాధి. పెయిన్ కిల్లర్స్ను అతిగా తీసుకోవడం వల్ల బ్రూస్లీ మెదడు కణాలు వాచిపోయాయని వైద్యులు భావించారు. సాధారణంగా మనిషి మెదడు సగటు బరువు 1400 గ్రాములు ఉంటుంది. కానీ బ్రూస్లీ చనిపోయినప్పుడు ఆయన మెదడు 1575 గ్రాముల వరకు ఉబ్బినట్టు వైద్యులు గుర్తించారు. అతిగా పెయిన్ కిల్లర్స్ను వాడటం వల్లే సెరెబ్రల్ ఎడిమా బారిన పడినట్టు భావించారు. కానీ అది నిజం కాదని తాజాగా స్పెయిన్ సైంటిస్టులు వెల్లడించారు. హైపోనాట్రేమియా వల్ల బ్రూస్లీ మెదడు వాపు వ్యాధి బారిన పడ్డారని తెలిపారు.
పరిమితికి మించి నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు కరిగిపోతుంటాయి. దీన్నే హైపోనాట్రేమియాగా పిలుస్తుంటారు. సోడియం లెవల్స్లో సమతుల్యత లోపించడం వల్ల శరీరంలోని కణాలు, ముఖ్యంగా మెదడు కణాలు వాపునకు గురయ్యాయని తెలిపారు. దీనివల్లే బ్రూస్లీ మరణించి ఉండొచ్చని కొత్త వాదనను వినిపించారు. బ్రూస్లీకి ఆల్కహాల్తో పాటు గంజాయి అలవాటు కూడా ఉండేది. ఇలా మాదకద్రవ్యాలను తీసుకోవడం వల్ల అతిగా దాహం వేయడం, దీనివల్ల అతిగా నీటిని తాగడం వల్ల కిడ్నీలపై అధిక పనిభారం పడింది. ఫలితంగా కిడ్నీలు వ్యర్థాలను బయటకు పంపించే సామర్థ్యం తగ్గి హైపోనాట్రేమియా బారిన పడి మరణించి ఉంటాడని తెలిపారు.
అయితే బ్రూస్లీ క్యారెట్, యాపిల్ జ్యూస్, ప్రోటీన్ డ్రింక్స్ వంటివి తన డైట్లో ఎక్కువగా ఉండేలా చూసుకునేవాడని బ్రూస్లీ భార్య లిండా లీ కాడ్వెల్ గతంలో తెలిపారు. బ్రూస్లీ మరణించడానికి కొద్ది రోజుల ముందు నుంచి రోజూ 10 నుంచి 20 సెరామిక్ బాటిళ్ల నీటిని తాగేవాడని బ్రూస్లీ అనుచరుడు ఒకరు అప్పట్లో వెల్లడించారు. బ్రూస్లీ ఏ లైఫ్ పేరుతో మాథ్యూ పాలీ అనే రచయిత ఒక పుస్తకాన్ని రాశాడు. అందులో నీళ్లు తనకు ఫ్రెండ్ అని బ్రూస్లీ చెప్పినట్టుగా ప్రస్తావించారు. కానీ అవే నీళ్లు బ్రూస్లీ మరణానికి కారణమని స్పెయిన్ సైంటిస్టుల అధ్యయనంలో తేలడం దురదృష్టం.
Read More Articles |
Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?
Python massage | కొండ చిలువతో మసాజ్ చేపించుకోవాలనుందా.. అయితే అక్కడికి వెళ్లాల్సిందే!
Bath in winter | చలికాలంలో వేడినీటి స్నానం చేస్తే మంచిదా? చన్నీటి స్నానమా?
Roanoke mystery | ఊరుకు ఊరే మాయమైంది.. అక్కడి జనం ఏమైపోయారో ఇప్పటికీ మిస్టరీనే !!