Twitter Hacked | ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ నుంచి భారీ డేటా లీకైంది. ట్విట్టర్ వెబ్సైట్ను హ్యాక్ చేసిన హ్యాకర్లు సుమారు 20 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించారు. ఈ డేటాను ఆన్లైన్ హ్యాకింగ్ ఫోరమ్లో విక్రయానికి కూడా ఉంచారు. ఇజ్రాయెల్కు చెందిన సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ సంస్థ హుడ్సన్ రాక్ బయటపెట్టిన ఈ విషయం కలకలం సృష్టిస్తోంది.
ట్విట్టర్ నుంచి పెద్ద ఎత్తున డేటా లీకైనట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దాదాపు 40 కోట్ల మంది డేటాను హ్యాకర్లు దొంగిలించినట్టు కథనాలు వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ యూజర్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో 20 కోట్ల మంది డేటా లీకైనట్టుగా హుడ్సన్ రాక్ సంస్థ వెల్లడించింది. రెండు వారాల కిందటే అంటే డిసెంబర్ 24 వరకే ఈ డేటా లీక్ అయినట్టుగా తెలిపింది. లీకైన డేటాలో జర్నలిస్టులు, ప్రముఖుల అకౌంట్ వివరాలు కూడా ఉన్నట్టు సమాచారం.
ట్విట్టర్ నుంచి భారీగా డేటా లీకేజీ కావడంపై హుడ్సన్ రాక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అలన్ గాల్ స్పందించాడు. తాను చూసిన అతి పెద్ద డేటా లీక్స్లో ఇదొక్కటి అని లింక్డ్ఇన్లో రాసుకొచ్చాడు. హ్యాకర్ల బారిన పడ్డ ఖాతాలకు హ్యాకింగ్, ఫిషింగ్, డాక్సింగ్ జరిగే ప్రమాదం అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా దీనిపై యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్, ఐర్లాండ్లోని డేటా ప్రొటెక్షన్ కమిషన్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. డేటా లీకేజీకి సంబంధించి ట్విట్టర్ కంపెనీ నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు.
Read More Articles:
Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే
Samosa | సమోసాలో ఎలుక.. తినేప్పుడు బయటపడటంతో దడుసుకున్న కస్టమర్.. సిద్దిపేట జిల్లాలోనే!