TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) షాకిచ్చింది. కొండ మీద వసతి గృహాల అద్దెలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో మొత్తం 6000 గదులు ఉండగా ఇటీవలే రూ.110 కోట్లతో టెండర్లు పిలిచి ఆధునీకరణ పనులు చేపట్టారు. గదుల్లో ఏసీలు, గీజర్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీనికి అనుగుణంగా ధరలను భారీగా పెంచేశారు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల కొండ మీద పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత నిలయంలో ధరలు రూ.500, రూ. 600 మాత్రమే ఉండేవి. ఇప్పుడు వీటి ధరలను రూ.1000 కి పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇక నారాయణగిరి రెస్ట్ హౌస్లో గదుల అద్దెను భారీగా పెంచారు. ఇందులో 1, 2, 3 లోని గదులను రూ.150 నుంచి జీఎస్టీతో కలిపి రూ. 1700కు పెంచారు. నాలుగో కాంప్లెక్స్లో కూడా రూ. 750 నుంచి రూ. 1700కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కార్నర్ సూట్ ధరలను రూ.2200, స్పెషల్ టైప్ కాటేజీల్లో రూ. 750 నుంచి రూ. 2800 వరకు పెంచారు. ఇప్పుడు దీనికి అనుగుణంగానే డిపాజిట్లు కూడా ఈ ధరలకు రెండు రెట్లు భక్తులు చెల్లించాల్సిందే. జనవరి 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. దీనిపై సామాన్య భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుమలను వ్యాపారకోణంలో కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా, భక్తుల కోణంలో చూడాలని కోరుతున్నారు.
ఇక సాధారణ భక్తులకు తక్కువ ధరలో లభించే 50, 100 రూపాయల గదుల్లో కూడా టీటీడీ ఆధునీకరణ పనులు చేపట్టి ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే మాత్రం సాధారణ భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక ఈనెల 12 నుంచి 31 తేదీ వరకు, ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.300 టికెట్లను సోమవారం ( జనవరి 9న) రోజున ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది.
Read More Articles:
Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే