Revanth Reddy | తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీసులో మంగళవారం రాత్రి సైబర్ క్రైం పోలీసులు చేసిన సోదాలు కలకలం రేపాయి. కేసీఆర్పై సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా తనిఖీలు చేసిన పోలీసులు ల్యాప్టాప్లు, కంప్యూటర్లు సీజ్ చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. కాంగ్రెస్ వార్ రూంపై పోలీసులు దాడి చేయడంపై ఏఐసీసీ కూడా సీరియస్ అయింది. దాడి వ్యవహారాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాకూర్ పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చారు.
ఈసారి అధికారమిస్తే వచ్చేది కిసాన్ సర్కారు కాదు.. లిక్కర్ సర్కారే
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కీలక నేతలతో భేటీ అయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాతో కలిసి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్కు మరోసారి అధికారం ఇస్తే వచ్చేది కిసాన్ సర్కారు కాదు లిక్కర్ సర్కారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదానికి కౌంటర్గానే అబ్ కీ బార్ లిక్కర్ సర్కార్ అని విమర్శించామని అన్నారు.
మీడియా సంస్థలను కేసీఆర్ కొనేశారు
కేసీఆర్కు అత్యంత ఇష్టమైన విషయాల్లో మద్యం ఒకటి కాబట్టే.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు మద్యాన్ని విస్తరించారని రేవంత్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక లిక్కర్పై ఆదాయం రూ.10,500 కోట్ల నుంచి రూ.36 వేల కోట్లకు పెరిగిందన్నారు. తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలను కేసీఆర్ కొనేశారని ఆరోపించారు. అందుకే సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగానే నిలదీస్తోందని అన్నారు. కేసీఆర్ అవినీతిపై కూడా సోషల్ మీడియాలోనే పోస్టులు చేస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు.
కేటీఆర్ అలిగిండు కాబట్టే ఢిల్లీకి రాలేదు..
అధికారాన్ని కాపాడుకునేందుకు బీజీపీ, బీఆర్ఎస్ నాటకాలాడుతున్నాయని, వీరి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అవినీతిపరుడైన కేసీఆర్కు సహకరించవద్దని కుమారస్వామి, అఖిలేష్ యాదవ్కు రేవంత్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో తెలంగాణను కవితకు అప్పగిస్తారనే కేసీఆర్పై కేటీఆర్ అలిగారని ఆరోపించారు. అందుకే ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవానికి రాలేదన్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే డీఎన్ఏ మారదని, అట్లాగే పార్టీ పేరు మార్చినంత మాత్రాన దాని డీఎన్ఏ మారదంటూ బీఆర్ఎస్ పార్టీనుద్దేశించి ఎద్దేవా చేశారు. పార్టీ పేరు మార్చినంత మాత్రాన బీఆర్ఎస్తో కాంగ్రెస్కు పొత్తు ఉండదన్నారు. మాదంతా యాంటీ కేసీఆర్ అంటూ విమర్శించారు.
Read More Articles |
Harishrao | తెలంగాణపై కేంద్రం ప్రశంసల వర్షం.. జాతీయ స్థాయిలో రెండు అవార్డులు దక్కించుకున్న రాష్ట్రం
BRS Party | ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన కేసీఆర్.. హాజరైన అఖిలేష్ యాదవ్, కుమారస్వామి