KCR | తెలంగాణ ఏర్పడిన తరువాత జిల్లాల ఏర్పాటు, జిల్లాకో నూతన కలెక్టరేట్లను నిర్మించాలనుకున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు . గురువారం మహబూబాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం దేశంలో పరిస్థితులు బాగోలేవన్నారు . రాజకీయ నాయకుల్లో చాలామందికి మత పిచ్చి, కుల పిచ్చి బాగా పెరిగిపోయిందన్నారు.
అదే పిచ్చితో ప్రజలను విడదీస్తే దేశం మరో ఆఫ్ఘానిస్తాన్ లా తయారు అవుతుందన్నారు. శాంతి, సహనంతో జనుల సంక్షేమాన్ని ఆకాంక్షించాలన్నారు. విద్వేషాలతో జాతి జీవనాడే దహించుకుపోయే పరిస్థితి ఉంటుందని కేసీఆర్ అన్నారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. మేధావులు కూడా ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించాలన్నారు.
నేను ఒక భారతీయ పౌరుడిగా ఆవేదన చెందుతూ చెబుతున్న మాటలు ఇవి అని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో మంచి ప్రభుత్వం ఉండాలి. ఈ విషయం గురించి ప్రతి గ్రామంలో కూడా చర్చ పెట్టాలని కోరారు. దేశానికి వెలుగు మార్గం చూపే అద్భుతమైన చైతన్య వీచిక తెలంగాణ నుంచే రావాలని కోరారు. అందుకు గానూ తెలంగాణలోని ప్రతి వ్యక్తి కూడా భాగస్వాములు కావాలన్నారు.
ఈ సందర్భంగా గతంలో మహబూబాబాద్ కు వచ్చినప్పుడున్న పరిస్థితులు గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో దారుణమైన కరవు పరిస్థితి ఉండేదన్నారు. ఒకనాడు ఆ పరిస్థితులు చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్లు ప్రస్తావించారు. వర్థన్నపేట, పాలకుర్తిలో సగం మాత్రమే పూర్తి అయిన కాలువలు చూసి ఈ జన్మలో నీళ్లు రావనుకున్నానన్నారు.
అమ్మా.. గోదావరి మా నేల మీదకు ఎప్పుడొస్తామని మొక్కుకున్నానని కేసీఆర్ అన్నారు. “ కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినా కూడా నీళ్ల కేటాయింపులు లేవు. మొండిగా ధైర్యం చేసి ముందుకు వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్నామన్నారు. మిషన్ భగీరథ మన దాహం తీర్చిందన్నారు. నదుల నిండా నీళ్లున్నాయి. కానీ ఈ నీటిని ప్రజల అవసరాలకు ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంది. చివరికి కరెంట్ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది” అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం కురవి వీరభద్రుడికి మొక్కుకున్నట్లుగా తెలిపారు. కురవి వీరభద్రస్వామి వారి దయ, మానుకోట రాళ్లబలం కలిసి తెలంగాణ సాకారమైందని సీఎం అన్నారు. నియోజకవర్గంలోని గ్రామ పంచాయితీలకు రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లుగా కేసీఆర్ చెప్పారు. వీటి పై పూర్తిగా సర్పంచ్ లకే అధికారం ఉంటుందని ఆయన వివరించారు.
మహబూబాబాద్ జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి కాలేజీ మొదలు కానుందని హామీ ఇచ్చారు. ఒకప్పుడు మహబూబాబాద్ కి ఇప్పటి మహబూబాబాద్ కి చాలా తేడా ఉందన్నారు. పట్టణానికి రూ.50 కోట్లు, జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana chief secretary | తెలంగాణకు తొలి మహిళా సీఎస్ .. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్