Bandi Sanjay | ఏపీ సీఎం జగన్తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అన్న బండి.. బీఆర్ఎస్ పేరుతో తెలంగాణను పక్కనపెట్టారని అన్నారు. కరీంనగర్లోని శ్రీ రాజరాజశ్వేర కళాశాల గ్రౌండ్స్లో ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి, బార్ అండ్ రెస్టారెంట్ సమితి అని విమర్శించారు. దేశంలో మోదీని ఎదుర్కొనేందుకు గుంటనక్కలు ఏకమయ్యాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీని సింహంతో పోలుస్తూ సింహం సింగిల్గానే వస్తది అంటూ వ్యాఖ్యానించారు.
మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు..
తెలంగాణలో ఒకటో తారీఖున జీతాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆస్పత్రుల్లో చూపించుకునే పరిస్థితి లేదని, హెల్త్ కార్డులు పని చేయట్లేదన్నారు. బీజేపీ అధికారంలోకి రాంగనే ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామన్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలోనూ మార్పులు తీసుకొస్తామన్నారు. ధరణి పేరుతో తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణకు ఏం చేశారో కేసీఆర్ చెప్పడం లేదన్న బండి.. మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
కరీంనగర్ గడ్డపై గాండ్రిస్తే వణుకు పుట్టాలి
తనను ఎన్నో అవమానాలకు గురిచేశారని కరీంనగర్లో సభలో బండి సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. గెలుపు ముఖ్యం కాదని, ప్రజలే ముఖ్యమని అన్నారు. డిపాజిట్ రాదని హేళన చేశారని కానీ కరీంనగర్ నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచానని అన్నారు. కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా.. అంటూ నినదించారు. కరీంనగర్ గడ్డపై నుంచి గాండ్రిస్తే కొందరికి వణుకు పుట్టాలని అన్నారు. కరీంనగర్లో కొట్లాడినట్లే రాష్ట్రమంతా కొట్లాడమని మోదీ, అమిత్ షా, నడ్డా చెప్పారని అన్నారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని చెప్పినట్లు తెలిపారు. పచ్చ జెండాను బొందపెట్టి, పింక్ జెండాను పీకేసి, తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణతో కేసీఆర్ బంధం తొలగించుకున్నాడు
2001లో సింహగర్జన పేరుతో ఇదే రాజరాజేశ్వర కాలేజీ గ్రౌండ్లో సభ పెడితే ఇప్పుడు వచ్చినంత మంది కూడా రాలేదన్నారు. సింహగర్జన పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇప్పుడు పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తీసేసిండని, తెలంగాణతో కేసీఆర్ బంధం తొలగించుకున్నాడని విమర్శించారు. కేసీఆర్ పీడ విరగడైందన్న బండి.. తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని దోచుకుందామని చూస్తున్నాడని అన్నారు. గ్రానైట్ స్కాం, డ్రగ్స్ స్కాం, భూముల స్కాం, లిక్కర్ స్కాం , ఇసుక స్కాం.. ఇలా రాష్ట్రంలోని దందాలు, స్కాంలన్నీ వాళ్లవే అంటూ కేసీఆర్పై మండిపడ్డారు.
రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ సహకరించట్లే
తెలంగాణ అభివృద్దికి కేసీఆర్ ఏమాత్రం సహకరించడం లేదన్న బండి. ఏపీతో కుమ్మక్కై, సెంటిమెంట్ రగిల్చి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఏపీ సీఎం జగన్తో కలిసి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ఏ వర్గం సంతోషంగా లేరని, కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. డబుల్ బెడ్ రూంలు కట్టిస్తానని గొప్పలు చెప్పిన కేసీఆర్.. విఫలమయ్యారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిలువ నీడ లేని పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామన్నారు.
తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితేంటి
తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు 4 లక్షల పైన అవసరం ఉంటే ప్రస్తుతం 3 లక్షల మందే ఉన్నారని అన్నారు. తెలంగాణలో ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశాడని మండిపడ్డారు. మోదీ ఒక్క నెలలో 1.46 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, మరో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని బండి సంజయ్ తెలిపారు.
ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది
విద్యావ్వవస్థను కేసీఆర్ నాశనం చేశాడని, హాస్టళ్లలో పురుగుల అన్నం పెడుతున్నారని ఆరోపించారు. ట్రిపుల్ ఐటీల్లో ధర్నాలు చేసే పరిస్థితి ఉందన్నారు. కనీస సౌకర్యాలు లేవని, సిబ్బంది కూడా సరిగా లేని పరిస్థితి ఉందన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల కుప్పగా కేసీఆర్ మార్చేశారని ఆరోపించారు. మరోసారి కేసీఆర్కు అధికారం ఇస్తే మరో ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తారని అన్నారు. తెలంగాణలో ఒక్కో వ్యక్తి మీద 2 లక్షల అప్పు చేస్తాడని అన్నారు. ఎనిమిదేండ్లు ఫాంహౌస్లో పండుకున్న కేసీఆర్ బీజేపీ పాదయాత్రను చూసే బయటకొచ్చిండని అన్నారు.
వారి భరతం పడతాం..
” మొదటి విడత పాదయాత్ర భాగ్యలక్ష్మి అమ్మావారి దగ్గర్నుంచి ప్రారంభించా, ఐదో విడత మహిషా (బైంసా)లో ప్రారంభించాను. బైంసాలోని హిందూవులకు ధైర్యం ఇచ్చేందుకే అక్కడి నుంచి యాత్ర మొదలుపెట్టా. నిరుపేద హిందువుల ఇండ్లు తగలబెడుతుంటే చూస్తూ ఉండిపోయారు. సకినాలు చేస్తున్న నా హిందువుల అప్పాల్లో ఉచ్చపోసిన లుచ్చా నా కొడుకుల భరతం పడతాం ” అంటూ తీవ్ర స్థాయిలో బండి సంజయ్ ధ్వజమెత్తారు.
Read More Articles |
Man trapped in cave | 43 గంటలుగా బండరాళ్ల మధ్య యువకుడి నరకయాతన.. క్షేమంగా బయటకు తీసిన అధికారులు
Husband committed suicide | ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.. ఏడు నెలలు కాకుండానే తనువు చాలించాడు..
Revanth Reddy | ఢిల్లీని తాకిన కాంగ్రెస్ వార్ రూం ఆఫీసులో సోదాల ఇష్యూ.. బీఆర్ఎస్తో పొత్తుపై రేవంత్రెడ్డి కామెంట్స్ ఇవే
Bandi Sanjay yatra | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్
Harishrao | తెలంగాణపై కేంద్రం ప్రశంసల వర్షం.. జాతీయ స్థాయిలో రెండు అవార్డులు దక్కించుకున్న రాష్ట్రం