Tamilisai | తెలంగాణ గౌరవాన్ని నిలబెడదామని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందని స్పష్టంచేశారు. కొంతమందికి తనకు నచ్చకపోవచ్చని.. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో జెండా ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. నా ప్రియమైన తెలంగాణ అంటూ తెలుగులో ప్రసంగం మొదలుపెట్టారు. ఈ సందర్బంగా సమ్మక్క – సారక్క, కొమ్రుం భీమ్ను ఆమె స్మరించుకున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది.. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. తెలంగాణకు విశిష్టమైన చరిత్ర ఉందని.. రాష్ట్రాభివృద్ధికి రాజ్భవన్ సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని.. పోషకాహార సమస్య నివారణకు కృషి చేశామని తెలిపారు.
తెలంగాణలో అందోళనకర పరిస్థితులు
తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. అభివృద్ధి అంటే కొత్త బిల్డింగ్లు కాదని అన్నారు. అభివృద్ధి అంటే కొత్త బిల్డింగ్లు కాదు.. నేషన్ బిల్డింగ్ అభివృద్ధి అని స్పష్టం చేశారు. ఫామ్హౌజ్లు కొందరికే కాదు.. అందరికీ కావాలని ఆమె అన్నారు. రైతులు, పేదలు, అందరికీ భూములు ఇళ్లు కావాలని అన్నారు.
కొందరికి నేనంటే ఇష్టం ఉండకపోవచ్చు
తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. జాతీయ రహదారుల విస్తరణకు భారీగా నిధులు ఇస్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభ్యున్నతిలో తన పాత్ర తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. హార్డ్ వర్క్, నిజాయితీ, ప్రేమ తనకున్న పెద్ద బలమని పేర్కొన్నారు. కొంతమందికి తను నచ్చకపోవచ్చని.. కానీ తనకు మాత్రం తెలంగాణ వాళ్లు అంటే ఇష్టమని తెలిపారు. అందుకే ఎంత కష్టమైనా పనిచేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
కీరవాణి సహా పలువుర్ని సత్కరించిన గవర్నర్ తమిళిసై
రిపబ్లిక్ డే సందర్బంగా రాజ్భవన్లో నిర్వహించిన వేడుకల్లో భాగంగా.. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను గవర్నర్ తమిళిసై సత్కరించారు. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, భగవాన్ మహావీర్ విక్లాంగ్ సహాయత సమితి (ఎన్జీవో), విద్యావేత్త బాలలత, కుడుముల లోకేశ్వరి ( పారా అథ్లెటిక్స్ ), టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజను సత్కరించారు. అంతకుముందు హైదరాబాద్లోని వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులు అర్పించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Women’s IPL | పురుషుల ఐపీఎల్ను మించిపోయిన మహిళల లీగ్.. రికార్డు ధరకు వేలం