Spouse Category | తెలంగాణలో టీచర్ల బదిలీ ప్రక్రియ మొదలు కానుంది. శుక్రవారం నుంచి ఈ బదిలీలు మొదలవనున్నాయి. అయితే దంపతులిద్దరిని ఒకేచోటుకి బదిలీ చేయాలని కొద్ది రోజులుగా టీచర్లు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారి ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చింది. స్పౌజ్ కేటగిరీ బదిలీలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
గతంలో నిలిపివేసిన 13 జిల్లాలో ఖాళీలకు అనుగుణంగా 615 మంది స్పౌజ్ బదిలీలకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని టీచర్ల బదిలీలకు సంబంధించిన జీవో నెం5 ను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం ఉదయం జారీ చేశారు. దరఖాస్తులను ఆన్ లైన్ ఈ నెల 28 నుంచి 30 వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉన్న ఖాళీల వివరాలను జనవరి 27వ తేదీన ప్రకటిస్తారు. దరఖాస్తుల హార్డ్ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎమ్యీవోలకు మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు.. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోలకు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 లోపు సమర్పించాలి.
ఈ ప్రక్రియ మార్చి 4 వరకు కొనసాగుతుంది.
బదిలీలన్నీ కూడా వెబ్ కౌన్సిలింగ్ విధానంలోనే ఉంటుంది. ఐదు సంవత్సరాలు దాటిన ప్రధానోపాధ్యాయులను, మూడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న వారిని దరఖాస్తు చేసుకోకపోయినా బదిలీ చేయనున్నట్లు జీవోలో తెలిపారు. పదవి విరమణకి దగ్గరగా ఉన్నవారికి వారు కోరుకుంటే తప్ప బదిలీ ప్రక్రియ ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొంది. బాలికల పాఠశాలల్లో 50 ఏళ్ల లోపు పురుష ఉపాధ్యాయులుంటే వారిని వెంటనే బదిలీ చేసి వారి స్థానాల్లో మహిళా టీచర్లను నియమిస్తారు.