Yadagirigutta | పిల్లలకు అండగా ఉండాల్సిన తండ్రి.. భార్యతో పాటు పిల్లలను వదిలేశాడు. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి కర్కశంగా వ్యవహరించింది. సహజీవనానికి అడ్డువస్తున్నారన్న కారణంతో పదేండ్ల వయసు కూడా లేని ముగ్గురు చిన్నారుల కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి నిర్దాక్షిణ్యంగా వదిలేసింది తల్లి . ఈ దారుణ ఘటన యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది.
తల్లి అలా ఎందుకు వదిలేసిందో తెలియక.. ఆకలిమంటతో అటూ ఇటూ తిరుగుతున్న చిన్నారులను ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 15న యాదగిరిగుట్ట వైకంఠ ద్వారం వద్ద, బస్టాండు వద్ద ముగ్గురు చిన్నారులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు కానిస్టేబుల్ కోటి గమనించారు. తప్పిపోయిన పిల్లలుగా అనుమానించి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
పిల్లలను వివరాలు అడగ్గా.. తమది రంగారెడ్డి జిల్లా సరూర్నగర్, భగత్ సింగ్ కాలనీ అని చెప్పారు. దీంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వెళ్లి ఆరాతీయగా స్థానికులు చెప్పిన విషయాలు విని పోలీసులు నివ్వెరపోయారు. ముగ్గురు పిల్లల తల్లిదండ్రులది ప్రేమ వివాహమని, పిల్లలు పుట్టిన తర్వాత మనస్పర్థలతో మూడేళ్ల క్రితం తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని చెప్పారు. తల్లి కూడా ఆ తర్వాత ఓ ఆటో డ్రైవర్తో సహజీవనం చేస్తుందని చెప్పారు. వీరికి ఒక పాప కూడా ఉన్నట్లు తెలిపారు. రక్త సంబంధీకుల గురించి ఆరాతీయగా పెద్దనాన్న ఉన్నట్లు తెలిసింది. అతనితో పోలీసులు మాట్లాడే ప్రయత్నం చేయగా.. వేరే చోట ఉన్నానని చెప్పాడు. దీంతో చేసేదేం లేక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. రెండు రోజుల తర్వాత వచ్చి తన తమ్ముడి పిల్లలే అని గుర్తించాడు. కానీ తన తమ్ముడు వీరికి దూరంగా ఉంటున్నాడని, తనకు కూడా ఏం సంబంధం లేదని చెప్పి వెళ్లిపోయాడు.
దీంతో ముగ్గురు పిల్లలను బాలల సంరక్షణ సమితి ఎదుట ప్రవేశపెట్టారు. అక్కడ పిల్లలు చెబుతున్న మాటలు విని అందరూ షాకయ్యారు. తమను తన తల్లి మరో వ్యక్తితో కలిసి ఆటోలో యాదగిరిగుట్టకు తీసుకువచ్చిందని చెప్పారు. కాళ్లు, చేతులు, కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి వదిలేశారని చెప్పారు. బాధ భరించలేని తాను కట్లు విప్పుకొని చెల్లె, తమ్ముడిని విడిపించినట్లు అమాయకంగా చెప్పాడు. ఆ మాటలు విన్న వారందరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సహజీవనానికి అడ్డువస్తున్నారనే కారణంతో చిన్నారులను వదిలేసినట్లు పోలీసులు భావించి హైదరాబాద్లోని శిశువిహార్లో ఎనిమిదేళ్ల బాలుడికి , మధురానగర్ శిశువిహార్లో ఇద్దరు చిన్నారులకు ఆశ్రయం కల్పించారు.
ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ పిల్లల తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని.. మోజు తీరాక పిల్లలను ఇలా నడిరోడ్డుపై వదిలేస్తే వారి జీవితాలు ఏం కావాలని మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Alia Bhatt | మూడు నెలల కిందటే పాపకు జన్మనిచ్చిన ఆలియా భట్.. మళ్లీ తల్లి కాబోతుందా?
Sarfaraz Khan | అర్జున్ టెండూల్కర్ కంటే అదృష్టవంతుడిని నాన్నా.. తండ్రితో సర్ఫరాజ్ఖాన్ భావోద్వేగం