Shadnagar Murder Mystery | అమాయకులను చేరదీయడం.. జాబు లేని వాళ్లకు ఉద్యోగం ఇస్తామని ఆశచూపడం.. తెలివిగా ఆధార్ కార్డు, పాన్ కార్డులు సంపాదించడం.. వాళ్ల పేరు మీద లోన్లు, ఇన్సూరెన్స్లు అప్లై చేయడం.. అవసరం తీరిన తర్వాత హత్య చేయడం.. వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం.. ఇదీ అతని నైజం. ఈ ప్రాసెస్లోనే ఓ వ్యక్తిని తెలివిగా చంపేసి యాక్సిడెంట్గా చిత్రీకరించాడు. దొరకనని ధీమాగా తిరిగాడు. కానీ పోలీసులు మాత్రం అతన్ని వదల్లేదు. అతన్ని నీడలా వెంటాడి కేసు చేధించారు. ఏడాది పాటు రహస్యంగా విచారణ జరిపి తగిన సాక్ష్యాధారాలతో నిందితుణ్ని కటకటాల వెనక్కి నెట్టారు.
ఏం జరిగింది?
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లో నివాసం ఉండే బోడ శ్రీకాంత్ విలాసాలకు అలవాటు పడ్డాడు. జల్సాలకు కావాల్సిన డబ్బుల కోసం కొత్త రకం మోసాలకు తెరలేపాడు. ఒక దొంగ కంపెనీ ఏర్పాటు చేసి అమాయకులైన వారిని తన దగ్గర ఉద్యోగంలో పెట్టుకునేవాడు. వారి పేరు మీద క్రెడిట్ కార్డులు తీసుకొని విలాసాలకు ఖర్చు చేసేవాడు. ఆ తర్వాత బిల్లులు ఎగ్గొట్టేవాడు. ఈ క్రమంలో తన దగ్గర పనికి చేరిన గుంటూరు జిల్లా నర్సంపేట మండలం గురజాలకు చెందిన భిక్షపతి దగ్గరయ్యాడు. అతనికి బంధువులు, తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో బినామీగా వాడుకున్నాడు. అతని పేరు మీద బ్యాంకులో 50 లక్షలు లోన్ తీసుకుని 2021లో మేడిపల్లి ప్రాంతంలో ఓ ఇల్లు కొనుగోలు చేశాడు. దానిపై మరో 50 లక్షలకు ఇన్సూరెన్స్ కూడా చేయించాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఇల్లును అమ్మేద్దామని శ్రీకాంత్ అనుకున్నాడు. కానీ ఇల్లు అమ్మేందుకు భిక్షపతి ఒప్పుకోలేదు.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పక్కా స్కెచ్
అమాయకుడు అనుకున్న భిక్షపతి ఎదురుతిరగడంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని శ్రీకాంత్ అనుకున్నాడు. ఇందుకోసం మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసు విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మోతీలాల్ను సాయం కోరాడు. నేరవిభాగంలో అనుభవం ఉండటంతో దొరక్కుండా భిక్షపతిని అడ్డు తొలగిస్తానని.. అందుకోసం 10 లక్షల రూపాయలు కావాలని మోతీలాల్ డిమాండ్ చేశాడు. మోతీలాల్ అడిగినంత ఇచ్చేందుకు శ్రీకాంత్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేశారు. డ్రైవర్లుగా పనిచేస్తున్న సతీశ్, సమన్నల సాయంతో భిక్షపతిని చంపేయాలని పథకం వేశారు.
ఎస్ఓటీ హెడ్ కానిస్టేబుల్కు 10 లక్షల సుపారీ
ఇందుకోసం వాళ్లకు చెరో 5 లక్షలు ఇస్తామని ఒప్పించారు. అలా మోతీలాల్కు పది లక్షలు, సతీశ్కు 5 లక్షలు, సమన్నకు 5 లక్షలు పోతే తనకు 30 లక్షలు మిగులుతాయని ఆశపడ్డాడు. అలాగే మేడిపల్లిలో ఉన్న ఇల్లు తన పేరు మీదకు వస్తుందని భావించాడు. దీంతో పథకం ప్రకారం 2021 డిసెంబర్ 22న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని మొగిలిగిద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఫుల్లుగా తాగించి హాకీ స్టిక్స్తో కొట్టి చంపారు. అనంతరం ఫోర్డ్ ఎండీవర్ ( TS 08HN8368) వాహనంతో తొక్కించి దారుణంగా హత్య చేశారు. యాక్సిడెంట్గా చిత్రీకరించారు.
అనుమానం ఎలా వచ్చింది?
భిక్షపతిని హత్య చేసిన తర్వాత అతనిపై ఉన్న 50 లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం శ్రీకాంత్ దరఖాస్తు చేశాడు. కానీ ఎలాంటి బంధుత్వం లేని శ్రీకాంత్ ఎలా నామినీ అయ్యాడని ఇన్సూరెన్స్ కంపెనీకి అనుమానం వచ్చింది. దీంతో ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించాయి. అప్పటికే భిక్షపతి యాక్సిడెంట్పై అనుమానాలు ఉన్నా పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. దీనిపై క్షుణ్నంగా విచారణ జరిపారు. ఏసీపీ కుశాల్కర్ నేతృత్వంలో షాద్ నగర్ పట్టణ సీఐ నవీన్ కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు, రాంబాబు కలిసి ఒక బృందంగా ఏర్పడి ఈ కేసులో సాక్ష్యాధారాలను సేకరించారు. పక్కా ఆధారాలతో నిందితులను అరెస్టు చేశారు. ఏ1గా శ్రీకాంత్, ఏ2గా మోతీలాల్, ఏ3గా సమ్మయ్య, ఏ4గా సతీశ్ పేర్లను చేర్చారు. ఈ కేసును చాకచక్యంగా చేధించిన షాద్నగర్ పోలీసులను శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా నగదు రివార్డు అందజేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
MMA Fighter Victoria | 18 ఏళ్లకే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ హఠాన్మరణం.. కారణమేంటో?
Legal Advice | భర్త కనిపించకుండా పోతే భార్యకు ఆస్తి దక్కుతుందా? దీనికి ఏం చేయాలి?