Revanth Reddy | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. దేశంతో పాటు తెలంగాణ కూడా ప్రమాదంలో ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్లో మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు పలు సూచనలు చేశారు.
దేశం, రాష్ట్రం ప్రమాదంలో ఉన్నాయని, ఇలాంటి సమయంలో వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజల కోసం పోరాడాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు తనపై చేసిన తిరుగుబాటుపై స్పందించిన రేవంత్.. పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ ఉంటాయని, వ్యక్తిగత సమస్యలపై చర్చ పెట్టొద్దని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై చర్చ పెట్టాలని, మన సమస్యల కంటే ప్రజా సమస్యలే కీలకమని వ్యాఖ్యానించారు. పార్టీలో బలోపేతం, ప్రజా సమస్యలు, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కొవడంపైనే చర్చ జరగాలని పిలుపునిచ్చారు.
దేశ ప్రజల స్వేఛ్ఛను కాపాడటానికి కాంగ్రెస్ ఆవిర్భవించిందని, ఆనాటి నుంచి దేశ సమగ్రతను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చిందన్నారు. మహాత్ముడు మరణించినా ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగిస్తోందని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ పరిపానలో సమూల మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. వివిధ ప్రాంతాలు, భాషల సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ కాపాడిందని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ నాయకులదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాయన్నారు. విదేశీ శక్తుల కుట్రతోనే రాజీవ్ గాంధీ హత్య జరిగిందన్న రేవంత్.. దేశానికి కంప్యూటర్ పరిచయం చేసింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. మహాత్మగాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ తమ ప్రాణాలను దేశం కోసం ఫణంగా పెట్టారు. ఇప్పుడు వారి వారసత్వాన్ని రాహుల్ గాంధీ కొనసాగిస్తున్నారు. తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని, బ్రిటీష్ పాలకులు అవలంభించిన విధానాలనే బీజేపీ సర్కార్ అవలంభిస్తుందన్నారు. మోదీ పాలనతో రూపాయి పతనం కావడంతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠ మసకబారింది అని రేవంత్ ఆరోపించారు.
దౌర్భాగ్య స్థితిలో మోదీ సర్కార్: Revanth reddy
దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటుంటే ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో మోదీ సర్కార్ ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ హెచ్చరించినా దేశ భద్రత కేంద్రానికి పట్టడం లేదని వ్యాఖ్యానించారు. దేశాన్ని ముప్పు నుంచి కాపాడేందుకు మహాత్మాగాంధీ స్ఫూర్తితో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నరని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం రాహుల్ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పాదయాత్ర భయంతోనే మోదీ కొవిడ్ రూల్స్ తీసుకొచ్చారని ఆరోపించారు. దేశ సమగ్రతను ఫణంగా పెట్టి బీజేపీ కుట్రలు చేస్తోందంటూ మండిపడ్డారు. ఇటు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో రాష్ట్రానికి విధ్వంసానికి గురైందని, కుటుంబసభ్యులకు దోచిపెట్టడానికి ఇప్పుడు దేశం మీద పడ్డారని రేవంత్ ఆరోపించారు.
బీజేపీ పాలన వల్ల స్వాతంత్ర్యం రాకముందు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని రేవంత్ ఆరోపించారు. దేశంలో అప్పటి బ్రిటిష్ పాలకులు కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టారని, ఇప్పటి బీజేపీ ప్రభుత్వం కూడా అదే చేస్తుందని విమర్శించారు. గతంలో సోనియా, రాహుల్ ఎలాంటి పదవులు తీసుకోకుండానే దేశ భద్రతను కాపాడారని రేవంత్ తెలిపారు.
Read More Articles |
Salman khan birth day celebrations | మాజీ ప్రియురాలికి ముద్దు పెట్టిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్
Omicron BF.7 | అక్కడ.. ఒమిక్రాన్ బీఎఫ్. 7 బాధితులకు రూపాయి ఖర్చు లేకుండా చికిత్స