Coronavirus | టైమ్ టు న్యూస్, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దడ పుట్టిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్పోర్టులోనే ఆర్టీపీసీఆర్ ( RT-PCR Test ) పరీక్షలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం శనివారం నుంచే అమల్లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు నిర్వహించాలి. వారిలో ఎవరికైనా పాజిటివ్ వచ్చినా.. లక్షణాలు కనిపించినా వెంటనే క్వారంటైన్కు తరలించాలి. అలాగే వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ ఎయిర్ సువిధ ఫారం నింపడం తప్పనిసరి అని కేంద్ర మంత్రి మాండవీయా తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు లేఖ
చైనాలో ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ ( Omicron bf.7 variant ) విజృంభిస్తోన్న తరుణంలో కొవిడ్ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో కొవిడ్ పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ.. అత్యవసర సమయాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల నిర్వహణను సరిచూసుకోవాలని సూచించింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత, వెంటిలేటర్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలని తెలిపింది. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకుని ప్రతి ఆదివారం ఆక్సిజన్ లభ్యతపై సమీక్ష నిర్వహించుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.
Read More Articles |
Kaikala Satyanaraya | మహాప్రస్థానంలో ముగిసిన కైకాల అంత్యక్రియలు
Worlds Largest outbreak | ఒక్కరోజే 3.7 కోట్ల కరోనా కేసులు.. చైనాలోకల్లోలం సృష్టిస్తున్న కరోనా