India-China troops clash | భారత్-చైనా సరిహద్దులోని తవాంగ్ సెక్టార్ వద్ద జరిగిన ఘర్షణపై లోక్ సభలో రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. చైనా సైనికులు మన భూభాగంలోకి వచ్చేందుకు సిద్ధపడ్డారని తెలిపారు. అయితే భారత సైనికులు ( Indian Army ) వారి ప్రయత్నాలను విజయవంతంగా తిప్పికొట్టారని ప్రకటించారు. మన సైనికుల్లో ఎవరికీ గాయాలు కాలేదని అన్నారు. మన సైనికుల సేవలను అభినందిస్తూ పార్లమెంట్ లో ప్రకటన చేశారు. మన భూభాగాన్ని కాపాడేందుకు భారత సైనికులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు.
ఈనెల 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ వద్ద ఈ ఘర్షణ జరిగినట్లు భారత సైన్యం కూడా ధృవీకరించిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ ( LAC ) వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే అక్కడ శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాల సైనికాధికారులు ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఇరు దేశాలు తమ బలగాలను అక్కడి నుంచి వెనక్కి రప్పించినట్లు సమాచారం.
దాదాపు 17వేల అడుగుల ఎత్తులో ఈ ఘర్షణ జరిగింది. దాదాపు 300 మంది చైనా సైనికులు ఉండగా.. భారత్ నుంచి దాదాపు అంతే సంఖ్యలో సైన్యం అక్కడ ఉంది. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలోకి చైనా సైనికులు దాదాపు 200 మంది వచ్చేందుకు ప్రయత్నించగా భారత సైన్యం అడ్డుకుంది. 2006 సుంచి ఇక్కడ ఇరుదేశాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది.
గల్వాన్ లోయలో 2020 జూన్లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 40 మంది చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత మళ్లీ ఇప్పుడే భారత్-చైనా బలగాల మధ్య ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
రాజ్నాథ్ సింగ్ కీలక సమావేశం
మరోవైపు వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ( CDS ) లెఫ్టినెంట్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్మీ జనరల్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నౌకాదళపతి అడ్మిరల్ హరికుమార్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి తదితరులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
Read More Articles |
Cyber Crime | 3 కోట్లకు కిడ్నీ అమ్మకానికి పెట్టి.. 16 లక్షలు పోగొట్టుకుంది..మోసపోయిన ఏపీ యువతి
Instagram | ఇన్స్టాగ్రామ్లో అసభ్యకర మెసేజ్లు వస్తున్నాయా? వాటిని ఇలా ఆపేయండి
Money Plant | మనీ ప్లాంట్ను ఏ దిక్కున పెంచాలి? ఇది ఎండిపోతే ఏమవుతుంది
Central government on OPS | పాత పెన్షన్ పథకంపై కేంద్రం కీలక కామెంట్స్.. ఇక అంతే సంగతులా ?