Kodi Pandalu | ఏపీలో కోడి పందాలు నిర్వహించేందుకు భారీగా బరులు సిద్ధమయ్యాయి. పంట పొలాలను, లే అవుట్లు, ఖాళీ స్థలాలను ట్రాక్టర్లతో దున్ని చదును చేసి బరులు సిద్ధం చేశారు. పోలీసుల హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా పందెం రాయుళ్లు రెడీ అయిపోతున్నారు. పందెం నిర్వహకులకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మద్ధతు ప్రకటిస్తుండటంతో పాటు పోటీలను ప్రారంభించబోతున్నారు. ఏపీతో పాటు తెలంగాణ నుంచి కూడా భారీ పోటీలకు వస్తుండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసేందుకు నిర్వహకులు రాత్రిపగలు కష్టపడుతున్నారు. ప్రచారాలు నిర్వహిస్తున్నారు. బరుల వద్దే మందు, విందులకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బరుల వద్ద దుకాణాలు ఏర్పాటు చేసేందుకు కూడా వేలం పాటలు నిర్వహిస్తున్నారు. పోలీసులు అడ్డు వచ్చినా కోడి పందాల విషయంలో వెనక్కి తగ్గేదిలేదని కోనసీమ జిల్లా ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశమైంది.అమలాపురంలోని కాటన్ గెస్ట్ హౌస్ లో జిల్లాలోని పలువురు ఇప్పటికే ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. కోడి పందాల నిర్వహణపై రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశానికి మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే రాపాక, కొండేటి చిట్టిబాబు, పొన్నాడ సతీష్ కుమార్, ఎమ్మెల్సీ త్రిమూర్తులు తదితరులు హాజరయ్యారు.
మూడు రోజులు కోడి పందాలు జరిగేలా సహకరించాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఇన్ ఛార్జీ మంత్రులను జిల్లాకు చెందిన ప్రజా ప్రతి నిధులు కోరారు. సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా వీటిని నిర్వహిస్తారని, వీటిని అడ్డుకుని, ఆంక్షలు విధించొద్దని కోరారు. ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ.. కోడిపందాలు, గుండాట యథావిధిగా ఉంటాయని చెప్పారు.
ప్లడ్ లైట్ల వెలుతురులో పందాలు.
ఇప్పటికే కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో బరులు సిద్దమయ్యాయి. భారీ సెట్టింగులు వేసి రాత్రి పగలు తేడా లేకుండా పందాలు నిర్వహించేందుకు ప్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.గురువారం నుంచే పొట్టేళ్ల పోటీలు, ట్రాక్టర్ రివర్స్ పోటీల పేరుతో జూద క్రీడలు మొదలయ్యాయి. నాలుగు రోజుల పాటు పగలూ రాత్రి పోటీలు నిర్వహించేందుకు అధికార పార్టీ నాయకులు రెడీ అయ్యారు.
రంగంలోకి దిగిన బౌన్సర్లు..
గుంటూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి భారీగా ఈ పందాల్లో పాల్గొనేందుకు వస్తారన్న అంచనాలతో ఆ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.కాళ్ల, ఆకివీడు, కైకలూరు, పాలకొల్లు, జంగారెడ్డి గూడెం, దెందులూరు, నిడమర్రు, పెదవేగి తదితర మండలాల్లో భారీ పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకివీడు, కాళ్ల, భీమవరం, కైకలూరు వంటి మండలాల్లో కార్లు, బైక్లు కూడా బహుమతులుగా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. బరుల వద్ద ఘర్షణలు జరిగితే అదుపు చేసేందుకు పెద్ద ఎత్తున బౌన్సర్లను కూడా దింపారు. సాయంత్రం నుంచి పందేల ప్రారంభించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Air India | ఎయిరిండియా మూత్ర విసర్జన కేసులో ఊహించని ట్విస్ట్.. ఆమెపైనే శంకర్ ఆరోపణలు!
Santokh singh chaudhary | భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ మృతి
Kerala Schools | ఇక స్కూళ్లలో సర్… మేడమ్ అనాల్సిన అవసరం లేదు… ఓన్లీ టీచర్.. ఆదేశాలు జారీ !