Karimnagar Mystery Deaths | తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో అనుమానాస్పద మరణాల మిస్టరీ వెనుక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నెల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడం ఇటీవల కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. వీరి మరణాలపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. వీళ్ల మరణానికి అంతుచిక్కని వ్యాధి కారణమా? లేదా ఎవరైనా విష ప్రయోగం చేశారా? అనే సందేహాలు మొదలయ్యాయి. కుటుంబానికి చేతబడి చేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో మరో కొత్త కోణం తెరపైకి వచ్చింది. భార్య, ఇద్దరు పిల్లలను భర్త వేముల శ్రీకాంత్నే పకడ్బందీగా విష ప్రయోగం జరిపి హత్య చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. నేరం బయటపడటంతో తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడని అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.
అసలేం జరిగింది?
గంగాధర మండలానికి చెందిన వేముల శ్రీకాంత్, మమత దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరిలో కుమారుడు అద్వైత్ (20 నెలలు ) డిసెంబర్ 16న అనారోగ్యంతో మరణించాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఐదేళ్ల పాప అమూల్య మృతిచెందింది. ఇంతలోనే మమంత కూడా అనారోగ్యానికి గురై డిసెంబర్ 18న కన్నుమూసింది. ఈ ముగ్గురిలోనూ వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి ఒకే రకమైన లక్షణాలు కనిపించాయి. నెల రోజుల వ్యవధిలోనే కట్టుకున్న భార్య, కన్నబిడ్డలు మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్ ఆరోగ్యం కూడా కొద్దిరోజుల్లోనే క్షీణించింది. అతనికి కూడా సేమ్ టు సేమ్ వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో ఆందోళన చెందిన బంధువులు శ్రీకాంత్ను డిసెంబర్ 30న ఆస్పత్రికి తరలించారు. అయితే ఏం జరిగిందో తెలియకుండా చికిత్స చేయడం కష్టమని అక్కడి వైద్యులు స్పష్టం చేశారు. దీంతో తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నట్టు శ్రీకాంత్ వెల్లడించాడు. ఆ తర్వాత వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించినప్పటికీ కాపాడలేకపోయారు.
అక్కడే అనుమానం మొదలైంది!
సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాడు కాబట్టి శ్రీకాంత్కు రక్తపు వాంతులు, విరేచనాలు అయ్యాయి. మరి అతని భార్యా పిల్లలు కూడా సేమ్ ఇలాంటి లక్షణాలతోనే ఎందుకు మరణించారు? అంటే వీరి శరీరంలో కూడా సోడియం హైడ్రాక్సైడ్ కలిసిందా? అనే అనుమానాలు పోలీసులకు తలెత్తాయి. దీంతో వీరికి ఎవరు విషం ఇచ్చి ఉంటారనే కోణంలో విచారణ జరుగుతోంది. భార్యాపిల్లలను శ్రీకాంత్నే విషమిచ్చి హత్య చేసి ఉంటాడా? అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసలు శ్రీకాంత్కు సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కడి నుంచి వచ్చింది? తను పనిచేస్తున్న కాలేజీ ల్యాబ్లో నుంచి తెచ్చాడా? బయట కొనుగోలు చేశాడా? అన్న విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. శ్రీకాంత్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకొచ్చిన తేదీలకు, వాళ్ల మరణాలకు గల తేదీలను పోలిస్తే కూడా మరణాల మిస్టరీలో శ్రీకాంత్ పాత్ర ఏంటో తెలిసిపోతుందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు అభిప్రాయపడుతున్నారు.
ముందు నుంచే అల్లుడిపై అనుమానం
కేవలం 33 రోజుల్లోనే తన కూతురు, ఆమె ఇద్దరి పిల్లలు మరణించడం పట్ల ముందు నుంచే మమత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మరణాల వెనుక తమ అల్లుడు శ్రీకాంత్ హస్తం ఉందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలోనే అనుమానాస్పద మరణాల మిస్టరీని చేధించేందుకు శ్రీకాంత్ ఇంటి సమీపంలోని బావి నీళ్లను, బంధువుల రక్త నమూనాలను పరిశీలించారు. కానీ లాభం లేకుండా పోయింది. దీంతో మమత మరణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆమె మృతదేహానికి విస్రా సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ రిపోర్టు రావడానికి నెల రోజులు పట్టే అవకాశం ఉంది. ఈలోపు శ్రీకాంత్ గురించి తెలుసుకునేందుకు పోలీసులు అతను పనిచేస్తున్న కాలేజీకి వెళ్లి అతని ప్రవర్తన గురించి ఆరా తీశారు. ఇలా దర్యాప్తు వేగంగా కొనసాగుతున్న సమయంలోనే శ్రీకాంత్ అనుమానాస్పదంగా అనారోగ్యానికి గురై మరణించాడు.
అత్తింటి వేధింపులే కారణమా?
మమత తల్లిదండ్రుల శ్రీకాంత్పై అనుమానం వ్యక్తం చేస్తుంటే.. అతని బంధువుల వాదన మాత్రం మరోలా ఉంది మమత మరణం తర్వాత పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం ఇవ్వాలని ఆమె తల్లిదండ్రులు శ్రీకాంత్ను వేధించారని వారు ఆరోపిస్తున్నారు. శ్రీకాంత్ పనిచేస్తున్న కాలేజీకి వెళ్లి మరి వాళ్లు గొడవ చేశారని పేర్కొన్నారు. రాజకీయ నాయకుల దగ్గరకు పిలిచి పంచాయితీ కూడా పెట్టించారని చెప్పారు. అలా అత్తింటి వారి ప్రవర్తనతో మనస్తాపం చెందే శ్రీకాంత్ బలవన్మరణానికి పాల్పడ్డాడని చెబుతున్నారు.
వివాహేతర సంబంధం కారణమా?
అనుమానాస్పద మరణాల మిస్టరీ వెనుక శ్రీకాంత్ పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్న టైమ్లో అతను ఆత్మహత్యకు యత్నించడం పలు అనుమానాలను రేకిత్తిస్తుంది. విచారణలో తన నేరం బయటపడుతుందనే అనుమానంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మమత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్టుగా శ్రీకాంత్నే వాళ్లను చంపాడా? ఒకవేళ చంపి ఉంటే కారణం ఏమై ఉంటుంది? ఆస్తి గొడవలు, వరకట్నం, వివాహేతర సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఏదేమైనా మమత పోస్టుమార్టంలోని విస్రా రిపోర్టు వస్తే తప్ప దీనిపై క్లారిటీ రాదు.
Read More Articles:
BRS Andhra Pradesh president | బీఆర్ఎస్ వైపు ఏపీ నాయకుల చూపులు.. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు అయనేనా?
Group 2 syllabus | నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 2 సిలబస్లో మార్పులు చేసిన టీఎస్పీఎస్సీ