Nepal plane crash | నేపాల్ విమాన ప్రమాదం తర్వాత ఒక్కో విషాద గాథ తెరమీదకు వస్తుంది. పొఖారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది సహా 72 మంది దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన జరిగిన పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం గురించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటకొచ్చాయి.
పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి కేవలం 15 రోజులే అవుతుంది. కొత్త సంవత్సరం రోజునే ( 2023 జనవరి 1వ తేదీన ) నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ దీన్ని ప్రారంభించారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్ట్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. దీని నిర్మాణానికి చైనాతో నేపాల్ ప్రభుత్వం 215 మిలియన్ డాలర్ల సాఫ్ట్ లోన్ ఒప్పందం చేసుకుంది. గత ఏడాదే చైనా మాజీ విదేశాంగ మంత్రి యాంగ్ యూ దీనిని నేపాల్ ప్రభుత్వానికి అప్పగించారు. విమానాశ్రయం ప్రారంభించిన 15 రోజుల్లోపే యేతి ఎయిర్లైన్స్కు చెందిన విమానం కూలిపోవడంతో దీని గురించి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఖాఠ్మాండూ ఎయిర్పోర్టు నుంచి ఉదయం 10 : 33 గంటలకు విమానం గాల్లోకి ఎగిరింది. పొఖారాకు సమీపించగానే ఎయిర్పోర్టులోని తూర్పు రన్ వేపై ల్యాండ్ అయ్యేందుకు అనుమతి తీసుకున్నారు. కానీ తర్వాత పైలట్ నిర్ణయం మార్చుకుని పడమర వైపు దిగాలని అనుకున్నాడు. ఏటీసీ సిబ్బంది దీనికి అనుమతినిచ్చారు. దీంతో విమానం ల్యాండింగ్కు ట్రై చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఇలా పైలట్ చివరి నిమిషంలో రన్వే మార్చుకోవడానికి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా తలెత్తి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇదే కాకుండా సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడం, ఎయిర్పోర్టు నిర్వహణలో వైఫల్యం కనిపిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా వాతావరణ పరిస్థితులను అంచనా వేసే అన్ని వసతులు నేపాల్ వద్ద లేవని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. యితే వాతావరణం సరిగా లేక విమానం కూలిపోయిందని వస్తున్న వార్తలను నేపాల్ ప్రభుత్వం కొట్టి పారేసింది. వాతావరణం సరిగానే ఉందని ఎలాంటి ఇబ్బందులు లేవని విమానాలు తిరగాడానికి అనుకూలంగానే ఉందని పేర్కొంది. విమానం కూలడానికి ముందే మంటలు చెలరేగాయని వెల్లడించింది. బ్లాక్ బాక్స్ను విశ్లేషించిన తర్వాత పూర్తి కారణాలు తెలుస్తాయని వెల్లడించింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం
Kodi pandalu | ఏపీలో దారుణం.. ఇద్దరి ప్రాణాలు తీసిన కోడి కత్తి.. కోడి పందాలు చూస్తుండగా ఘటన