MLC kavitha | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణ తర్వాత ఎమ్మెల్సీ కవిత తొలిసారి స్పందించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏజెన్సీలతో దాడులు చేస్తున్నారని, అలాంటి దాడులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఆడపిల్లల కండ్ల నుంచి నీళ్లు రావు.. నిప్పులు వస్తాయని తేల్చిచెప్పారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ముషీరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కవిత తాజా వ్యాఖ్యలు చేశారు.
దేశం అన్ని ఇండెక్స్ల్లోనూ కిందకు పడిపోయిందని, ఇలాంటి దుస్థితికి బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉందన్న కవిత.. ఈలోపు మన సత్తా చూపిద్దామంటూ పిలుపునిచ్చారు. మన భాష, పండుగల మీద జరుగుతున్న వివక్షను ఉద్యమంలో భాగంగా ప్రజలకు వివరించామని.. ఆనాడు బతుకమ్మ ఎత్తుకోవాలంటే సిగ్గుపడేవారని గుర్తు చేశారు. ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటే సంతోషంగా జరుపుకొంటున్నారని అన్నారు. స్కూలు పాఠ్యాంశాల్లోనూ బతుకమ్మ చేరిందని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చోటు లభించిందన్నారు. రాష్ట్రం సాధించిన తర్వాత మన ఆకాంక్షలు నెరవేర్చకున్నామని అన్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏజెన్సీలతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దాడులు చేస్తూ మన సమయాన్ని వృథా చేస్తున్నారని, మనకు మిగిలిన సమయంలో డబుల్, త్రిపుల్ పని చేయాలి కానీ వెనక్కి తగ్గొద్దని పిలుపునిచ్చారు. ప్రజాసమూహాన్ని చైతన్య పరచాలంటే భావజాల వ్యాప్తి అవసరం అని కవిత అన్నారు. బోధించు, పోరాడు అని అంబేద్కర్ చెప్పారని, అదే సిద్ధాంతాన్ని ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ సమయంలో చెప్పారని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలను ఎదురించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
Read More Articles |
Cyber Crime | 3 కోట్లకు కిడ్నీ అమ్మకానికి పెట్టి.. 16 లక్షలు పోగొట్టుకుంది..మోసపోయిన ఏపీ యువతి
Instagram | ఇన్స్టాగ్రామ్లో అసభ్యకర మెసేజ్లు వస్తున్నాయా? వాటిని ఇలా ఆపేయండి
Money Plant | మనీ ప్లాంట్ను ఏ దిక్కున పెంచాలి? ఇది ఎండిపోతే ఏమవుతుంది