Macherla | ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన అల్లర్ల నేపథ్యంలో మాచర్ల నివురుగప్పిన నిప్పుల మారింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాత్రి జరిగిన పరిణామాల నేపథ్యంలో మాచర్ల పట్టణంలో 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. పట్టణం మొత్తం ఎక్కడిక్కడ భారీగా పోలీసులు మోహరించారు. రాత్రి జరిగిన అల్లర్ల నేపథ్యంలో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి రాత్రే మాచర్లకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోసారి దాడులు జరగకుండా ఉండేందుకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
విచారణకు డీజీపీ ఆదేశం
మాచర్ల ఘటనపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విచారణకు ఆదేశించారు. పట్టణంలో అదనపు బలగాలను మోహరింపజేశారు. ప్రస్తుతం మాచర్లలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఈ సందర్భంగా డీజీపీ తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ అల్లర్లకు సంబంధించిన నిందితులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
అసలు ఏం జరిగింది?
టీడీపీ చేపట్టిన ఇదేం ఖర్య కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ర్యాలీ చేపట్టారు. టీడీపీ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన మొదలుపెట్టారు.టీడీపీ ర్యాలీ గురించి తెలిసి మున్సిపల్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు కూడా భారీగా మోహరించాయి. ఇరువర్గాలు కూడా పోటీపోటీగా నినాదాలు చేశాయి.పట్టణంలోని చిన్న కాన్వెంట్ సమీపంలోకి రాగానే టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం పెరిగింది. పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఇది మరింత ముదరడంతో కర్రలతో కూడా కొట్టుకునే స్థాయికి వెళ్లింది. మాచర్ల రణరంగంగా మారడంతో బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన్ను గుంటూరు తరలించారు.దీంతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు.. బ్రహ్మారెడ్డి ఇంటిపై దాడికి దిగారు. వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. రాత్రి 11 గంటల వరకు అలాగే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారీగా పోలీసులు రంగంలోకి దిగారు. దాడులకు పాల్పడేవారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Read More Articles |
Fire Accident | మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవ దహనం.. ప్రమాదమా? కావాలనే నిప్పు పెట్టారా?
Bandi Sanjay | తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై బండి సంజయ్ కామెంట్స్.. సిద్ధంగా ఉండాలంటూ నేతలకు సూచన