Janasena President Pawan Kalyan | వైసీపీ నాయకులపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలవదని.. తాను గెలవనివ్వనని చెప్పారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో కౌలురైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ ఆదివారం పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ రైతులు సంతోషంగా లేరని ఈ సందర్భంగా పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కంటతడి పెట్టిన నేల సుభిక్షంగా ఉండదని పేర్కొన్నారు.
వారానికి ఒక్కసారి వస్తేనే తట్టుకోలేకపోతున్నారు
రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడ్డాయి కాబట్టి వైసీపీ నేతలు అవినీతికి హాలీడే ప్రకటించిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తనను వారాంతపు పొలిటీషియన్ అని ఎద్దేవా చేస్తున్నారని.. కాపు నాయకులతో బూతులు తిట్టిస్తున్నారని గుర్తు చేశారు. వారానికి ఒక్కరోజు వస్తేనే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. తనకు తాతలు సంపాదించి పెట్టిన వేల కోట్ల ఆస్తులు లేవని.. అక్రమాలు, దోపిడీ చేసిన డబ్బులు లేవని.. కష్టార్జితంతో రైతులకు సాయం చేస్తున్నానని తెలిపారు. నష్టపోయిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఈ సందర్భంగా సాయం అందించారు.
బీజేపీకి, టీడీపీకి అమ్ముడుపోయే ఖర్మ నాకేం లేదు
ఎమ్మెల్యే స్థాయి కూడా లేని వ్యక్తి సత్తెనపల్లిలో అవినీతి చేస్తున్నాడని ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై విమర్శలు గుప్పించారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటి అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదని.. గెలవనివ్వమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీని అధికారంలోకి రాకుండా చేసే బాధ్యత మీదేనని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ పార్టీకి తాను అమ్ముడుపోలేదని పవన్ చెప్పాడు. బీజేపీ, టీడీపీకి అమ్ముడుపోయే ఖర్మ తనకేమీ లేదని స్పష్టం చేశాడు.వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చవద్దనే మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం దుశ్చర్యల వల్లే రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తున్నానని తెలిపారు. అక్రమాలు చేసే ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం వ్యతిరేక శక్తులు అన్నింటినీ ఏకం చేస్తానని చెప్పారు.
ఆ బాధ్యత నాకు అప్పగించండి
వచ్చే ఎన్నికల్లో గొడవలు జరుగతాయి.. వైసీపీ దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జన సైనికులకు పిలుపునిచ్చారు. మాచర్లలో వైసీపీ దౌర్జన్యం చూశాం కదా.. రాష్ట్రంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమేనని తెలిపారు. అందుకే వైసీపీని ఓడించేందుకు ఎన్నికల వ్యూహాన్ని తనకు వదిలేయాలని.. తానే చూసుకుంటానని.. జనసేనను అధికారం దిశగా నడిపించే బాధ్యత తనదని స్పష్టం చేశాడు. మీరు గట్టిగా అనుకుంటే ముఖ్యమంత్రిని అవుతా అని పేర్కొన్నారు.
దమ్ముంటే వారాహిని ఆపండి
నా వారాహితో ఏపీ రోడ్లపై తిరుగుతాను.. ఎవరు ఆపుతారో నేను చూస్తానంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. నా వారాహిని ఆపితే నేనేంటో చూపిస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More Articles |
Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?
Macherla | రణరంగంగా మారిన మాచర్ల.. టీడీపీ, వైసీపీ శ్రేణుల వీరంగంతో హైటెన్షన్..