Pawan Kalyan | జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి కొండగట్టులో ప్రత్యేక పూజలు పూర్తయ్యాయి. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ప్రచార రథం ఎక్కారు. అనంతరం వారాహి పైనుంచి అభిమానులు, జనసేన కార్యకర్తలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా కొండగట్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.
వారాహికి కొండగట్టులోనే పూజ ఎందుకు?
వారాహి ప్రచార రథానికి పూజలు నిర్వహించేందుకు ప్రత్యేక కారణమేంటి ? అక్కడి నుంచి వాహనాన్ని ప్రారంభించాలని ఎందుకు అనుకుంటున్నారు ? కొండగట్టు అంజన్నఅంటే ఎందుకు అంత నమ్మకం అనుకుంటున్నారు కదూ. అందుకు బలమైన కారణం ఉందంటున్నారు పవన్ శ్రేయోభిలాశులు.
2009 ఎన్నికల సమయంలో ఆయన మొదటి సారిగా కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆయనకు హై ఓల్టేజ్ విద్యుత్ తీగలు తగిలాయి. కానీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దయ వల్లే ఆనాడు ప్రమాదం నుంచి బయటపడినట్లు పవన్ కళ్యాణ్ విశ్వసిస్తారు. అప్పటి నుంచి ఆయనకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద విపరీతమైన నమ్మకం, భక్తి ఏర్పడ్డాయి.
ఆ తరువాత నుంచి ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా ఇక్కడి స్వామి వారిని దర్శించుకున్నాకే మొదలు పెడతారు. ఈ నేపథ్యంలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రత్యేకంగా రూపొందించిన వారాహి వాహనాన్ని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధి నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. ముందుగా వాహనానికి పూజాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. రానున్న రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాల పై చర్చించి దిశా నిర్దేశం చేస్తారు.
కాగా ఇదే రోజున అనుష్టుప్ నారసింహ యాత్రను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ యాత్రకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చూడతారు. వాటితో పాటే మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారు. పవన్ ముందుగానే ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి గురించి ఏపీలో పెద్ద చర్చే నడిచింది. వాహనం రంగు చట్ట విరుద్దమంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ పై విమర్శలు గుప్పించారు. వారాహికి ఎంచుకున్న రంగుకు ఆర్టీఏ అనుమతి ఇవ్వద్దంటూ మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. పలువురు వైసీపీ నేతలు కూడా దీనిపై చర్చావేదికలు నిర్వహించారు. దీని గురించి జనసేన అధినేత క్లారిటీ ఇచ్చినప్పటికీ వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేశారు. అయితే తెలంగాణలో వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్ పూర్తయిందని ప్రకటించగానే వివాదం సద్దుమణిగింది.
Follow Us : Google News, Facebook, Twitter