Narendra Modi | తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం స్పెషల్ ఫోకస్ పెట్టిందా ? రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ స్థాయిలో సత్తా చాటాలని చూస్తుంటే.. కేసీఆర్ను రాష్ట్రానికే పరిమితం చేయాలన్న ఆలోచనలో బీజేపీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే భారీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ కూడా పెట్టారని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఏకంగా ప్రధాని మోదీని రంగంలోకి దించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తెలంగాణలోని మహబూబ్నగర్ లోక్సభ స్థానాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం.
పార్టీ అంతర్గత సర్వేలో మహబూబ్నగర్ లోక్సభ స్థానం బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు తేలింది. ఇప్పటికే అమిత్ షా మహబూబ్నగర్లో సీక్రెట్గా సర్వే కూడా చేపించినట్లు తెలుస్తోంది. మోదీ మహబూబ్నగర్ నుంచి పోటీ చేస్తే రాష్ట్రంపై, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాపై ఏ స్థాయిలో ప్రభావం ఉంటుందన్న విషయంపై సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. త్వరలో రెండోసారి సర్వే నిర్వహించి మోదీ పోటీపై హైకమాండ్ నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారన్న ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లగలిగితే ఆ ప్రభావం కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీకి ముందు నుంచే పట్టుంది. వాజ్పేయి హయాంలో మహబూబ్నగర్ నుంచి బీజేపీ టికెట్పై జితేందర్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ నుంచి బీజేపీ తరఫున 2012లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. మరోవైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బలమైన నేతలు ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు. 2014లో ఇదే లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన జితేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు. మరోవైపు జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న డీకే అరుణ కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. వీరిద్దరితో పాటు క్షేత్ర స్థాయిలో బీజేపీ బలంగా ఉండటంతో జిల్లాపై అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ ఇక్కడి నుంచి రంగంలోకి దిగితే ఆ ప్రభావం తెలంగాణ మొత్తం మీద ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహబూబ్నగర్ నుంచి మోదీ పోటీచేయాలని జితేందర్ రెడ్డి ఇటీవలే ట్విటర్ వేదికగా కోరారు. ఈ విషయంపై మోదీని కలిసి చర్చిస్తానని వెల్లడించారు.
మోదీ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసే పరిస్థితి లేకుంటే సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే ఆలోచన కూడా చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు తమిళనాడులోని రామనాథపురం పైనా మోదీ గురి పెట్టినట్లు తెలుస్తోంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే
Sakthivanesvara Temple | ఈ ఆలయంలో పూజలు చేస్తే దంపతుల ఇబ్బందులు తొలగిపోతాయట.. ఎక్కడుందో తెలుసా?
Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?