Sircilla Rajeswari | దివ్యాంగ రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని నివాసంలో బుధవారం తుదిశ్వాస విడిచారు.
సిరిసిల్ల పట్టణం సాయినగర్లోని నేతన్న కుటుంబంలో బూర రాజేశ్వరి జన్మించారు. బూర అనసూయ – సాంబయ్య దంపతులకు మూడో సంతానం. మిగిలిన పిల్లలు అందరూ మామూలుగా ఉన్నప్పటికీ.. రాజేశ్వరి మాత్రం అంగవైకల్యంతో జన్మించారు. పదేండ్లు వచ్చేదాకా నడక కూడా రాలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా ఎవరో ఒకరు ఎత్తుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అయినా సరే తన మీద ఎవరూ జాలి చూపించకూడదని మొండి ధైర్యం తెచ్చుకుంది. పట్టుదలతో కష్టపడి మెల్ల మెల్లగా నడవడం నేర్చుకుంది. రెండు చేతులు పనిచేయకపోయినా.. కాళ్లతోనే నాలుగు అక్షరాలు నేర్చుకుంది. తన వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ కాళ్లతోనే కవితలు రాయడం మొదలుపెట్టింది.1990లో తొలిసారి కలం పట్టిన రాజేశ్వరి.. ఇప్పటివరకు 700కు పైగా కవితలు రాసింది. సాహిత్య లోకంలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. సిరిసిల్ల రాజేశ్వరిగా పేరు తెచ్చుకుంది.
రాజేశ్వరి ప్రతిభ గుర్తించిన సుద్దాల అశోక్ తేజ
ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు రాజేశ్వరి ఏకలవ్య శిష్యురాలు. ఆయన పాటలు, మాటలతో ప్రభావితమైన రాజేశ్వరి సాహిత్యం వైపు వెళ్లింది. రాజేశ్వరి రాస్తున్న కవితల గురించి తెలుసుకున్న సుద్దాల అశోక్ తేజ, తన భార్య నిర్మలతో వెళ్లి ఒకసారి రాజేశ్వరిని కలిశారు.ఆమె రాసిన కవితల్ని సుద్దాల ఫౌండేషన్ ద్వారా సిరిసిల్ల రాజేశ్వరి కవితల పేరుతో పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు.రాజేశ్వరి రాసిన 350 కవితలను పుస్తకంగా తీసుకొచ్చారు.
10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్.. డబుల్ బెడ్రూం అందజేసిన కేసీఆర్
సిరిసిల్ల రాజేశ్వరి ప్రతిభ గురించి కేవీ రమణాచారి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దివ్యాంగురాలైనప్పటికీ అద్భుతంగా కవితలు రాయడం కేసీఆర్ను ఎంతగానో ఆకట్టుకుంది. వెంటనే ప్రభుత్వం తరఫున రాజేశ్వరి పేరిట 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. నెల నెల రూ.10వేల పెన్షన్ అందేలా ఏర్పాటు చేశారు. వీటితో పాటు తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని కేసీఆర్ కాలనీలో ఆమెకు డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా అందజేశారు.
మహారాష్ట్రలో పాఠ్యాంశంగా ఆమె జీవితం
అంగవైకల్యం, మాటలు రాకపోవడం వల్ల తను మనసులో పడుతున్న వేధనను అక్షరాల రూపంలో బయటపెట్టేది. అందుకే రాజేశ్వరి రాసిన కవితలు మనసుకు హత్తుకునేవి. అదే ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.రాజేశ్వరి గురించి స్థానిక మీడియాలే కాదు.. బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా కూడా కథనాలు ప్రచురించింది. ఈమె ప్రతిభను గుర్తించిన మహారాష్ట్ర విద్యా శాఖ ఇంటర్ సిలబస్లో సిరిసిల్ల రాజేశ్వరి గురించి పాఠ్యాంశంగా కూడా తీసుకొచ్చింది.
మంత్రి కేటీఆర్ సంతాపం
సిరిసిల్ల రాజేశ్వరి మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. తన వైకల్యాలను జయించి.. ఆత్మవిశ్వాసంతో కాళ్లతోనే అక్షరాలు నేర్చుకుని కవితలు రాసిన తీరు అద్భుతమని కొనియాడారు. ఆమె స్ఫూర్తివంతమైన జీవన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శమని తెలిపారు. రాజేశ్వరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Read More Articles |
Dogs | కుక్కలు ఆకాశంలో చంద్రుణ్ని చూస్తూ ఎందుకు అరుస్తాయి?
Vasthu shastra | అరటి చెట్టు ఇంట్లో పెంచితే అరిష్టమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?
Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన