Breaking News | గత ఆదివారం హైదరాబాద్లో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలోని లంగర్హౌజ్లో ఓ యువకుడిని చుట్టుముట్టిన నలుగురు దుండగులు, కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మృతి చెందిన యువకుడిని ఖలీమ్గా పోలీసులు గుర్తించారు. నిందితుల సోదరిని గత ఏడాది ఖలీమ్ ప్రేమ వివాహం చేసుకున్నాడని తెలిపారు. మహమ్మద్ సైఫ్, మహమ్మద్ వసీమ్, మహమ్మద్ ఫైజల్, మహమ్మద్ సమీర్ అనే నలుగురు కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏడాది క్రితం నిందితుల సోదరిని ఖలీమ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత ఏడాది మార్చిలో నిందితుల సోదరికి మరో యువకుడితో వివాహం జరిగింది. అయితే పెళ్లికి రెండు రోజుల ముందు ఖలీమ్ అనే యువకుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. దీన్ని అవమానంగా భావించిన ఆమె సోదరులు ఖలీమ్పై కక్ష పెంచుకున్నారు. అప్పటి నుంచే హత్యకు ప్లాన్ వేశారు. అదను కోసం చూస్తున్నారు.
అయితే ఇటీవలే ఖలీమ్తో పాటు సోదరితో కలిసిపోయినట్లు నలుగురు నిందితులు నటించారు. గోల్కొండ సమీపంలో గదిని అద్దెకు తీసుకోవాలని కోరారు. ఖలీమ్తో పాటు సోదరి కూడా ఓకే చెప్పడంతో గోల్కొండ సమీపంలో డిసెంబరులో గదిని అద్దెకు ఇప్పించారు. ఇక అప్పటి నుంచి ఖలీమ్ను హత్య చేసేందుకు నలుగురు ప్లాన్ చేస్తున్నారు. గత ఆదివారం నడిరోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న ఖలీమ్ను వెంబడించి కత్తులు, వేడకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. అబ్దుల్ రహమాన్ అనే యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు, నిందితులు అందరూ దగ్గరి బంధువులేనని పోలీసులు వెల్లడించారు.
Follow Us : Google News, Facebook, Twitter