BRS Andhra Pradesh president | బీఆర్ఎస్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు దొరికినట్టేనా ? కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితిలో ఏపీ నాయకులు చేరేందుకు సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏపీకి చెందిన పలువురు ముఖ్యనాయకులు కేసీఆర్తో టచ్లోకి వచ్చారని సమాచారం. మాజీ ఐఏఎస్లు, మాజీ ఐఆర్ఎస్లు తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. వీరిలో మాజీ మంత్రి కూడా ఉన్నారు.
ఏపీకి చెందిన మాజీ మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథితో పాటు పలువురు బ్యూరోక్రాట్లు సోమవారం బీఆర్ఎస్లో చేరనున్నారు. ముఖ్యంగా విద్యార్థి జేఏసీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి ముందు నుంచి మద్దతు తెలపుతున్నారు. తాజాగా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కీలక నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ విద్యార్థి యువజన జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీ అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ స్పందించారు.
గడిచిన తొమ్మిదేళ్లలో చంద్రబాబు, జగన్ అధ్వాన్న పాలనలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని రంగాలు నాశనమయ్యాయని జగదీశ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఏపీ నేతలు తీసుకున్న నిర్ణయంతో ఏపీ భవిష్యత్తుకు బాటలు పడ్డాయని అన్నారు. అన్ని వర్గాలు, అన్ని రంగాల్లో ఏపీ విధ్వంసానికి గురైందని, కేసీఆర్ లాంటి ఉద్యమనేత వల్లనే ఏపీలో సమస్యలు తీరి అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎదురించిన నేత కేసీఆర్ అని కొనియాడారు. సమస్యల నుంచి గట్టెక్కించగలిగే సామర్థ్యమున్న నాయకుడు కేసీఆర్ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడతారన్నారు. ఏపీలోనూ బీఆర్ఎస్ జెండా రెపరెపలాడతుందన్నారు. ఆ దిశగా ఏపీ నేతలు బీఆర్ఎస్లో చేరుతుండటం పట్ల వారికి స్డూడెంట్స్ యూత్ జేఏసీ పక్షాన శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు ఆయనే..
మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున చంద్రశేఖర్ పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడాయనపై కేసీఆర్ ఫోకస్ పెట్టారని, ఆయన్నే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమించాలని కూడా కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ను చేర్చుకోవడం ద్వారా ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును ప్రభావితం చేసేలా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం ద్వారా ఆ వర్గం నాయకులు బీఆర్ఎస్ పార్టీ వైపు ఆకర్షితమవుతారని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తోట చంద్రశేఖర్ 2014లో ఏలూరు లోక్సభ నుంచి వైసీపీ తరఫును పోటీ చేసి.. మాగంటి బాబు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జనసేనలో చేరి గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
Read More Articles:
Free Ration | తెల్ల రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉచిత బియ్యం పంపిణీకి ఏపీ సీఎం జగన్ నిర్ణయం
SI, Constable Mains | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
Accident | ఇద్దరి ప్రాణాలు తీసిన న్యూఇయర్ జోష్.. బంజారాహిల్స్లో కారు బీభత్సం
Corona | చైనాలో రోజుకు 9 వేల కరోనా మరణాలు.. మార్చినాటికి 100 కోట్ల మందికి వైరస్!