BTech Student | బీటెక్ పూర్తయింది.. ఏం చేయాలని ఆలోచిస్తున్న టైమ్లో తమ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు అప్లోడ్ చేస్తే డబ్బులు ఇస్తామనే ఒక ఆఫర్ వచ్చింది. వీడియోలు అప్లోడ్ చేయడమే కదా.. పోయేదేం ఉందని ఆ యువతి దానికి ఒప్పుకుంది. ఒక్కో వీడియోకు రెండు నుంచి మూడు వేల వరకు ఆదాయం కూడా ఇవ్వడంతో వాళ్లను పూర్తిగా నమ్మింది. ఆన్లైన్లో పెట్టుబడి పెడదామంటే నమ్మి మోసపోయింది. సైబర్ నేరగాళ్లకు రూ.14లక్షలకు పైగా సమర్పించుకుంది. చివరకు మోసపోయానని తెలుసుకుని లబోదిబోమంటోంది. వైఎస్సార్ కడప జిల్లాలోని పోరుమామిళ్లలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని బీటెక్ పూర్తి చేసింది. తమ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు అప్లోడ్ చేస్తే డబ్బులిస్తామని ఒక ఆఫర్ వచ్చింది. సైబర్ నేరగాళ్లు పన్నిన ఉచ్చు అని తెలియక ఆ యువతి ఒప్పుకుంది. వీడియోలు చేసుకుంటూ అప్లోడ్ చేసింది. అలా వీడియోలు పెట్టినందుకు మొదటి రోజు రూ.2వేలు, రెండో రోజు రూ.3వేలు కూడా ఇచ్చారు. నిజంగానే డబ్బులు వస్తుండటంతో వాళ్లను పూర్తిగా నమ్మింది. యువతి తమను పూర్తిగా నమ్ముతుందని నిర్ధారించుకున్న తర్వాత ఆమెకు ఒక బిజినెస్ ఐడియా చెప్పారు.
ఆన్లైన్లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే రెట్టింపు డబ్బు పొందవచ్చని ఆశచూపింది. వాళ్లను గుడ్డిగా నమ్మిన సదరు విద్యార్థి సరేనంది. అలా కొద్దిరోజులు పోయాక వచ్చిన డబ్బును తీసుకోవాలంటే ట్యాక్స్ల రూపంలో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని విద్యార్థినికి చెప్పారు. ఆమె కూడా నిజమేనేమో అనుకుని డబ్బులు ఇచ్చింది. తన దగ్గర లేకపోయినా బయట అప్పు చేసి మరీ లక్షలు సమర్పించుకుంది. ఈ నెల 6, 10వ తేదీల్లో రెండు విడతల్లో రూ.14,75,000 వాళ్ల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. అప్పట్నుంచి అవతలి వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బీటెక్ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Women’s IPL | పురుషుల ఐపీఎల్ను మించిపోయిన మహిళల లీగ్.. రికార్డు ధరకు వేలం