Congress political crisis |కాంగ్రెస్ పార్టీలో పరిస్థితిపై మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని ప్రక్షాళన చేయాలని లేదంటే మనుగడకే ముప్పని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కోవర్టిజం అనే రోగం వచ్చిందని, దాన్ని నిర్మూలించకుంటే మనుగడే కష్టమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కాంగ్రెస్ లోనే ఉంటూ కోవర్టులుగా పని చేస్తూ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాట పాడుతూ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కార్యకర్తల ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే పార్టీ ఉనికికే ప్రమాదమని అన్నారు. కార్యకర్తలను డీమోలరైజ్ చేసే ప్రయత్నం జరుగుతుందని, ఆ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కోవర్టు వ్యవస్థను నిర్మూలించి పార్టీని కాపాడాలని హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఇప్పుడు దీన స్థితిలో ఉందన్న దామోదర రాజనర్సింహా.. పార్టీలో బీసీలు, దళితులు, మైనార్టీలకు గుర్తింపు దక్కడం లేదన్నారు. కొత్త కమిటీల కూర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. అసలైన కాంగ్రెస్ నేతలకు న్యాయం జరగడం లేదన్నారు. జిల్లాలో రివ్యూలు ఎందుకు జరగడం లేదంటూ ప్రశ్నించారు. కమిటీల్లో అనర్హులకు చోటు కల్పించారని విమర్శించారు.
ఉమ్మడి ఏపీలో కూడా ఇంత మందితో కమిటీలు వేయలేదన్నారు. ఇప్పటికే చాలా తప్పిదాలు చాలా జరిగాయని, ఇప్పటికైనా వాటిని గుర్తించి సరిచేసుకోవాలని సూచించారు. అసలైన కార్యకర్తలను కాపాడుకోవాలని, కార్యకర్తలను కాపాడే బాధ్యత హైకమాండ్ పైనే ఉందన్నారు. హైకమాండ్ ను గౌరవిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని మించినది లేదంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో దొంగలను గుర్తించాలని, లేదంటే పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం ఉందన్నారు.
కాంగ్రెస్ కల్చర్, సిద్దాంతం, పద్ధతులు తెల్వని వాళ్లకు పదవులు ఇచ్చారని విమర్శించారు. జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెండ్లను ఏ ప్రతిపాదికన ఎంపిక చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై అపారమైన భక్తి, గౌరవం ఉన్న కార్యకర్తలు ఇప్పుడు అబాసుపాలవుతున్నారన్నారు. కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వట్లేదని, కేవలం కోవర్టులకే పదువుల ఇస్తున్నారని మండిపడ్డారు. ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీ బలోపేతం అవుతుందో ఆలోచన చేయాలని సూచించారు. అందరూ కలిసి పనిచేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందా.. లేక ఎవరి అజెండా వారిదేనా అంటూ ప్రశ్నించారు. ఇలా కొట్లాడుకుంటే అధికారంలోకి వస్తామా అన్న అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఒక అజెండా ఉందా.. ఎవరి అజెండానైనా ఫాలో అవుతున్నామా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు రావాలి.. లేదంటే కాంగ్రెస్ మనుగడ చాలా కష్టమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు కాపాడే బాధ్యత హైకమాండ్ పైనే ఉందన్నారు.
Read More Articles |
MLC kavitha | సీబీఐ విచారణ తర్వాత తొలిసారి స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. కేంద్రంపై కీలక వ్యాఖ్యలు
Ramcharan – Upasana | మెగా అభిమానులకు గుడ్న్యూస్.. తండ్రి కాబోతున్న రామ్చరణ్