Covid 19 | చైనాలో కరోనా కల్లోలం ఏం లేదని ఇన్నాళ్లు చెబుతున్న మాటలన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. చైనాలో కరోనాతో 30 రోజుల వ్యవధిలోనే 60 వేలమంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 8 నుంచి జనవరి 12 వరకు సంభవించిన మరణాలను లెక్క గట్టి ఈ విషయాలను బయటపెట్టారు.
అయితే ఇందులో 5,503 మంది మాత్రం శ్వాస సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయారని చైనా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జియోవ్ యహుయ్ తెలిపారు. మిగతా 54,435 మంది కరోనాతో పాటు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారేనని పేర్కొన్నారు. కేన్సర్తో పాటు గుండె జబ్బుల వంటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడే వారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అయితే వీరిలో 90 శాతం మంది 65 ఏళ్ల పైబడిన వాళ్లేనని అన్నారు.
చైనా కరోనా కేసులను, మరణాలను తక్కువ చేసి చూపుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు చైనా తాజాగా విడుదల చేసిన గణాంకాలను చూస్తే ఇన్నాళ్లు చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలిందని అంతర్జాతీయ నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశంలో కరోనా వాస్తవ పరిస్థితి గురించి చైనా ఇంకా నిజాలు దాస్తున్నది అనడానికి తాజాగా వెల్లడించిన మరణాల సంఖ్యనే నిదర్శనమని అంటున్నారు. వైద్య సంస్థలు రికార్డు చేసిన మరణాల రికార్డుల మేరకే నెల రోజుల్లో 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారని తేలిందని, వాస్తవంగా ఇంకా ఆ సంఖ్య ఎక్కువే ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
కరోనా మరణాల సంఖ్యను రోజూవారీగా నమ్మదగిన డేటాను అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటి నుంచో కోరుతోంది. తాజాగా మరోసారి డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ చైనాను కోరారు. చైనాలో 60 ఏళ్ల పైబడిన లక్షలాది మందికి కరోనా టీకా ఇవ్వలేదు. ఫలితంగానే వృద్ధుల మరణాల సంఖ్య భారీగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Women’s Under 19 T20 World Cup | మహిళల అండర్ 19 ప్రపంచ కప్లో భారత్ విజయం.. దంచికొట్టిన ఓపెనర్లు