Delhi Accident | కొత్త సంవత్సరం వేళ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన యాక్సిడెంట్లో సంచలన విషయాలు బయటకొచ్చాయి. న్యూ ఇయర్ సంబరాల్లో తప్ప తాగిన కొందరు యవకులు ఆదివారం తెల్లవారుజామున ఇష్టారాజ్యంగా కారుని నడుపుతూ ఒక స్కూటీని ఢీకొట్టారు. స్కూటీపై వెళ్తున్న 20 ఏళ్ల యువతి కారు కింద పడిపోతే.. ఏం జరిగిందో కూడా చూడకుండా దాదాపు 20 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. గంటన్నరపాటు యూటర్న్లు తీసుకుంటూ ఢిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టారు. దీంతో కారు చక్రాల కింద నలిగిపోయి మృతురాలి శరీరం ఛిద్రమైంది. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా బయటకొచ్చాయి.
అసలేం జరిగింది?
ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని సుల్తాన్పురిలో కారు కింద ఒక యువతి శరీరాన్ని ఈడ్చుకెళ్తున్నట్టు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీస్ కంట్రోల్ రూమ్కు ఓ ఫోన్ వచ్చింది. రోహిణిలోని కంఝావాలా నుంచి కుతూబ్గఢ్ వైపు ఈ కారు వెళ్తున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతలోనే కంఝావాల ప్రాంతంలో రోడ్డుపై యువతి మృతదేహం పడి ఉందని సమాచారం వచ్చింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారు నంబర్ సాయంతో అందులో ప్రయాణించిన ఐదుగుర్ని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు క్రెడిట్ కార్డు కలెక్షన్ ఏజెంట్, డ్రైవర్, రేషన్ షాప్ యజమాని ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన యువతిని అమన్ విహార్కు చెందిన అంజలిగా గుర్తించారు.
ప్రత్యక్ష సాక్షి కథనం ఇదీ..
ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో పెద్ద చప్పుడు వినబడిందని.. చూస్తే ఒక కారు స్కూటీని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి దీపక్ దహియా మీడియాకు వెల్లడించాడు. మహిళ శరీరాన్ని కారు ఈడ్చుకెళ్లడం చూసి పోలీసులకు సమాచారం అందించామని పేర్కొన్నాడు. అయితే ఆ కారు మళ్లీ 3.30 గంటల సమయంలో యూటర్న్ తీసుకుందని చెప్పాడు. అప్పటికీ యువతి మృతదేహం కారు చక్రాల కిందనే ఉందన్నాడు. అలా కారులో ఉన్న వ్యక్తులు పలుమార్లు యూటర్న్ తీసుకున్నారని.. వారిని ఆపేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా వినిపించుకోలేదని తెలిపాడు. గంటన్నరపాటు దాదాపు 20 కిలోమీటర్లు ఆ మృతదేహాన్ని ఈడ్చుకెళ్లారని పేర్కొన్నాడు. ఆ తర్వాత కంఝావాలా రోడ్డులో జ్యోతి గ్రామం వద్ద మృతదేహం కింద పడిపోయిందని తెలిపాడు. ఇది కేవలం ప్రమాదమే కాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు.
అత్యాచారం జరగలేదు : ఢిల్లీ పోలీసులు
తమ కారు స్కూటీని ఢీకొట్టిన విషయం తెలుసని యువకులు ఒప్పుకున్నారు. కానీ యువతి కారు చక్రాల కింద ఇరుక్కుపోయినట్టు తమకు తెలియనది తెలిపారు. విండోలు మూసి ఉండటం, మ్యూజిక్ శబ్దం ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదాన్ని గుర్తించలేదని నిందితులు చెప్పారని ఢిల్లీ పోలీసు అధికారి హరేంద్ర కె సింగ్ వెల్లడించారు. అయితే ఇది అత్యాచారం కేసు అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని చెప్పిన ఆయన.. అందులో నిజం లేదని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
కాంఝావాల్ ఘటన సిగ్గు చేటు
ప్రమాద ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ ఘటన సిగ్గు చేటు అని ఆయన వ్యాఖ్యానించారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఘటన గురించి తెలిసి తనకు తల కొట్టేసినట్టైందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్న్ వీకే సక్సెనా ట్వీట్ చేశారు.
ఇంటికి పెద్ద దిక్కు అంజలినే
కారు కింద ప్రాణాలు కోల్పోయిన యువతిని అమన్ విహార్కు చెందిన అంజలిగా గుర్తించారు. అంజలికి నలుగురు చెల్లెల్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమై అంజలి తండ్రి మరణించారు. దీంతో ఇంటి బాధ్యతను తీసుకున్న అంజలి.. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో పార్ట్ టైమ్వర్క్ చేస్తోందని పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా శనివారం కూడా ఒక ఫంక్షన్లో పని చేసి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
Read More Articles:
BRS Andhra Pradesh president | బీఆర్ఎస్ వైపు ఏపీ నాయకుల చూపులు.. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు అయనేనా?
Tamil nadu | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. డీఏ పెంచిన తమిళనాడు సీఎం
Chandrababu | చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మహిళల మృతి.. పలువురి పరిస్థితి విషమం
SI, Constable Mains | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల