Brazil | బ్రెజిల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో ఓడిపోయారు. ఓటమిని అంగీకరించడానికి నిరాకరిస్తూ ఆయన మద్దతుదారులు దేశ రాజధాని బ్రెసీలియాలో అరాచకం సృష్టించారు. సుప్రీంకోర్టు, కాంగ్రెస్, అధ్యక్ష భవనాల్లోకి చొచ్చుకెళ్లారు. నేషనల్ కాంగ్రెస్ భవనాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు భద్రతా వలయాన్ని ఛేదించుకుని కీలక భవనాల్లోకి చొరబడ్డారు. విలువైన సామాగ్రితో పాటు కుర్చీలు, కిటికీలను ధ్వంసం చేశారు. అమెరికాలో జరిగిన యూఎస్ క్యాపిటల్ విధ్వంసం తరహాలోనే ఇప్పుడు బ్రెజిల్లోనూ జరిగింది.
రంగంలోకి దిగిన భద్రతా బలగాలు హెలికాప్టర్ల ద్వారా టియర్ గ్యాస్ను ప్రయోగించాయి. ఈ ఘటనలో పోలీసులు, జర్నలిస్టులపై ఆందోళనకారులు దాడికి దిగారు. దాదాపు 3 వేల మంది ఆందోళనకారులు ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా, నేషనల్ కాంగ్రెస్ భవనం వద్ద పోలీసులు దాదాపు 300 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బోల్సొనారో ఓడిపోయారు. దీంతో ఆయన స్థానంలో గత వారమే బ్రెజిల్ అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లూడా డ సిల్వా అధికారం చేపట్టారు. ఇప్పుడు సైన్యం జోక్యం చేసుకుని ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియోను పదవి నుంచి దించేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
రాజధాని బ్రెసిలీయాలోని అధికారిక భవనాలపై ఆందోళనకారుల దాడిని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఖండించారు. బోల్సొనారోనే ఆందోళనకారులను రెచ్చగొట్టారని అన్నారు. విధ్వంసం సృష్టిస్తున్న మూకను అదుపులోకి తీసుకుని అల్లర్లను అదుపుచేయాలని భద్రతా దళాలను ఆదేశించారు. ఆందోళనకారులను పాసిస్ట్ మతోన్మాదులతో పోల్చిన ఆయన.. దోషులు శిక్ష అనుభవించాల్సందేనని హెచ్చరించారు. మరోవైపు బోల్సొనారో కూడా ఈ ఘటనపై స్పందించారు. అధికారిక భవనాలపై దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఈ దాడి వెనుక తాను ఉన్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేయడంలో తప్పులేదన్నారు.
బ్రెజిల్లో అల్లర్లను ప్రపంచ దేశాలు ఖండించాయి. బ్రెజిల్లోని ప్రభుత్వ కార్యాలయాలపై దాడులను ప్రధాని మోదీ ఖండించారు. ప్రజాస్వామ్య సంప్రదాయలను అందరూ గౌరవించాల్సిందేనని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రెజిల్లోని ప్రజాస్వామ్య వ్యవస్థలకు తమ మద్దుతు ఉంటుందని ప్రకటించారు. అటు ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఈ దాడులను ఖండిస్తున్నట్లు చెప్పారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Weather Effect | పంజా విసురుతున్న చలి.. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం