Bandi Sanjay | టీఆర్ఎస్ పేరు నుంచి తెలంగాణ తీసేసినందుకు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) క్షమాపణలు చెప్పాలని బీజేపీ ( BJP ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ప్రజా సంగ్రామ పాదయాత్ర రోడ్ షోలో మాట్లాడిన బండి సంజయ్.. శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య, సుమన్ వంటి అమరుల త్యాగాల వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మస్వరాజ్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా అని ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రజాకారుల వారసులను తరిమికొడతామని బండి హెచ్చిరించారు. బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి నినాదం ఏమైందని కేసీఆర్ ను ప్రశ్నించారు. గల్ఫ్ లో చనిపోయిన తెలంగాణ కార్మికుల శవాలను వారం రోజులైనా తీసుకురాలేని దద్దమ్మ సీఎం కేసీఆర్ అంటూ మండి పడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసి వచ్చి బీజేపీలో చేరాలని బండి పిలుపునిచ్చారు. మీరెప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి మిమ్మల్ని అవమానిస్తారంటూ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసి రండి.. ప్రగతి భవన్ ను బద్దలు కొడదాం అంటూ పిలుపునిచ్చారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, పోలీసులు మొదట ఉరికించేది కేసీఆర్ నే అంటూ వ్యాఖ్యానించారు. లక్ష కోట్ల దొంగ సారా దందాతో తెలంగాణ తలదించుకునే దుస్థితికి కేసీఆర్ బిడ్డ కవిత తీసుకొచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితికి కారణమైన కవితను ఎందుకు అరెస్టు చేయకూడదూ అంటూ ప్రశ్నించారు. నీ బిడ్డ ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా.. అమెను అరెస్టు చేస్తే ఎందుకు నిరసన తెలపాలి అంటూ కామెంట్ చేశారు.