Cricket Australia | టైమ్ 2 న్యూస్, బెంగళూరు: ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా కసరత్తులు ప్రారంభించింది. ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ప్రాక్టీస్ షురూ చేసింది. సాధారణంగా టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు స్థానిక జట్లతో టూర్ మ్యాచ్ ఆడే సంప్రదాయం కొనసాగుతుండగా.. ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా కంగారూలు నేరుగా నాగ్పూర్ టెస్టులో బరిలోకి దిగుతున్నారు.
భారత్కు చేరుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్ల కోసం బీసీసీఐ బెంగళూరులో నాలుగు రోజుల ప్రత్యేక శిక్షణ అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటికే భారత పరిస్థితులకు అలవాటు పడ్డ ఆసీస్ ఆటగాళ్లు ఇక అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. భారత్లో భారత్ను ఓడించడం కష్టమని ఇప్పటికే ఆసీస్ దిగ్గజం చాపెల్ పేర్కొనగా.. స్పిన్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆసీస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
స్పిన్పై పైచేయి కోసం..
సాధారణంగా భారత్లో టెస్టు మ్యాచ్లంటే స్పిన్నర్లే కీలక పాత్ర పోషిస్తారు. అందులోనూ ఆసీస్ వంటి జట్టుపై అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ రూపంలో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు అందుబాటులో ఉండటంతో.. ఆసీస్ ఈ స్పిన్ త్రయాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఇరు జట్ల మధ్య నాగ్పూర్లో తొలి టెస్టు జరుగనుండగా.. అశ్విన్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు.. అతడిలాగే బౌలింగ్ చేసే నెట్ బౌలర్తో కంగరూలు ప్రాక్టీస్ చేస్తున్నారు. బరోడాకు చెందిన మహేశ్ అనే స్పిన్నర్ అచ్చం అశ్విన్ను పోలిన బంతులు వేస్తుండటంతో ఆసీస్ ఆటగాళ్లు నెట్స్లో అతడి బౌలింగ్లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇది అశ్విన్ డూప్లికెట్ బౌలింగ్గా సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నది. ౖఫ్లెటెడ్ డెలివరీలతో ఎక్కువ వికెట్లు పడగొట్టే అశ్విన్ వంటి రనప్ ఉన్న మహేశ్ బౌలింగ్లో వాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. అతడిని నెట్ బౌలర్గా ఎంపిక చేసుకున్న ఆసీస్.. అశ్విన్ వ్యుహాన్ని ఛేదించే పనిలో పడింది. అయితే ఆసీస్ ప్రధానంగా అశ్విన్, జడేజా బౌలింగ్పై దృష్టి పెడితే.. వారికి అక్షర్ పటేల్ నుంచి అసలు సిసలు ముప్పు ఉంటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సొంతగడ్డపై గింగిరాలు తిరిగే బంతులతో విజృంభించే అక్షర్ను ఎదుర్కోవడం కంగరూలకు కత్తిమీద సామే అనే మాటలు వినిపిస్తున్నాయి.
WTC ఫైనల్ బాటలో..
ప్రస్తుతం ఐసీసీ టీ20, వన్డే ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా ‘బోర్డర్-గవాస్కర్’ ట్రోఫీని 2-0 లేదా అంతకంటే మెరుగైన ప్రదర్శనతో కైవసం చేసుకోగలిగితే టెస్టుల్లోనూ టాప్ ప్లేస్ దక్కించుకోనుంది. దీంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) ఫైనల్కు కూడా అర్హత సాధించనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్పై వన్డే, టీ20 సిరీస్లు నెగ్గి ఉత్సాహంలో ఉన్న భారత్.. ఆసీస్తో టెస్టు సిరీస్లోనూ అదే జోరు కొనసాగించాలని ఆశిద్దాం.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Afridi Marriage | ఒక ఇంటివాడైన అఫ్రిది.. దిగ్గజ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది కూతురితో ‘నిఖా’
Joginder Sharma | వరల్డ్ కప్ వీరుడి వీడ్కోలు.. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన జోగిందర్ శర్మ
Hardik Pandya | ధోనీ అడుగుజాడల్లో హార్దిక్.. సారథ్య బాధ్యతతో తగ్గిన పాండ్యా స్ట్రయిక్రేట్
Hanuma Vihari | మణికట్టు విరిగినా.. వెరవకుండా విహారి బ్యాటింగ్.. రంజీలో అద్భుతం
Sachin Tendulkar | సచిన్ చేతుల మీదుగా.. అండర్-19 జట్టుకు సన్మానం.. 5 కోట్ల చెక్ అందజేత