child marriage | బాల్య వివాహాల నిర్మూలనకు అస్సాం ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. 14 ఏళ్లలోపు వయసున్న బాలికలను పెళ్లి చేసుకుంటే యావజ్జీవ జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది. పోక్సో చట్టం కింద అరెస్టు చేసి వారికి ఈ శిక్ష అమలు చేస్తామని పేర్కొంది. 14 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలను పెళ్లి చేసుకుంటే బాల్య వివాహాల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకుంటామని తెలిపింది.
అస్సాం రాష్ట్రంలో మాతా, శిశు మరణాల రేటు అధికంగా ఉంది. దీనికి బాల్య వివాహాలే కారణమని ఆరోగ్య అధికారులు భావిస్తున్నారు. అందుకే బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. దీనిపై తాజాగా కేబినెట్ మీటింగ్లో అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ చర్చించారు. రాష్ట్రంలో ఏటా జరిగే 31 శాతం పెళ్లిళ్లు బాల్య వివాహాలేనని సీఎం హిమంత్ పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండని బాలికలకే పెళ్లిళ్లు చేస్తున్నారని అన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 కింద 18 ఏళ్ల లోపు బాలికలను పెళ్లి చేసుకునే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. గ్రామాల్లో జరుగుతున్న బాల్య వివాహాలను అడ్డుకోవడం, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక పంచాయతీ సెక్రటరీదేనని ఆయన స్పష్టం చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter