AP CM Jagan Meets PM Modi | ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లిన జగన్.. బుధవారం మోదీతో సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సహా తదితర అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు. ఏపీలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులపై చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ సాయంత్రం జగన్ సమావేశం కానున్నారు.
మోదీతో భేటీలో జగన్ ప్రస్తావించిన అంశాలివే..
➣ విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను పరిష్కరించాలని ప్రధాని మోదీని జగన్ కోరారు. 32014-15 సంవత్సరానికి సంబంధించిన రూ.18,330.45 కోట్ల బిల్లులు అలాగే పదో వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు అన్నీ కలిపి మొత్తంగా రూ.32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని మోదీ దృష్టికి జగన్ తీసుకెళ్లారు. ఈ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని కోరారు.
➣ గత ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు చేసిందని.. ఆ రుణాలను ఇప్పుడు సర్దుబాటు చేస్తూ కొత్త రుణాలపై కేంద్ర ఆర్థిక శాఖ పరిమితి విధిస్తోందని తెలిపారు. కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని కోరారు.
➣ పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధుల నుంచి ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదని.. ఆ డబ్బును వెంటనే చెల్లించాల్సిందిగా కోరారు.పోలవరం పునరావాసానికి రూ.10,485.38 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
➣ తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను ఇప్పించాల్సిందిగా కోరారు.
➣ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదాపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకమని.. పార్లమెంటు వేదికగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేశారు.
➣ కొత్తగా మంజూరు చేసిన 3 కాలేజీలతో కలిపి ఇప్పటికి 14 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని మోదీ దృష్టికి జగన్ తీసుకెళ్లారు. జిల్లాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 26కు చేరిందని తెలిపారు. మిగిలిన 12 జిల్లాలకు కూడా మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరారు.
➣ కడపలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్కు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని కోరారు.
➣ విశాఖలో 76.9 కిలోమేటర్ల మేర మెట్రో రైలు ఏర్పాటు కోసం ఇప్పటికే డీపీఆర్ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని.. ఈ ప్రాజెక్టుకు సహాయం అందించాని విజ్ఞప్తి చేశారు.
Read More Articles |
Salman khan birth day celebrations | మాజీ ప్రియురాలికి ముద్దు పెట్టిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్
Omicron BF.7 | అక్కడ.. ఒమిక్రాన్ బీఎఫ్. 7 బాధితులకు రూపాయి ఖర్చు లేకుండా చికిత్స