YSRCP | మహాశివరాత్రి సందర్భంగా వైఎస్ఆర్సీపీ తన అధికారిక ట్వి్ట్టర్లో పోస్టు చేసిన ఫొటోపై ఏపీలో దుమారం రేగుతోంది. వైఎస్ జగన్ శివుని రూపంలో ఉన్న చిన్నపిల్లాడికి పాలు తాగిస్తున్నట్లు ఉన్న ఫొటోపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. బీజేపీ మత రాజకీయాలను మానుకోవాలని మండిపడుతున్నారు. ఈ ఫొటోతో ఏరకంగా బీజేపీ మనోభావాలు దెబ్బతిన్నాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
కులాలు, మతాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం బీజేపీ మానుకోవాలని ఏపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. మానవసేవే మాధవసేవ అని బీజేపీ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. పేదలకు సాయం చేస్తే దేవుడికి సాయం చేసినట్లే అవుతుందని బీజేపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు.
ఏపీలో బీజేపీకి అవకాశం లేదు.. అందుకే ఆ పార్టీలోని వాళ్లే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఏదోవిధంగా రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. అన్నార్థుల ఆకలిని తీర్చడమే శివారాధన అని చెబుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ట్వీట్ చేసిందని స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ కావాలని రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. దీంతో బీజేపీ ఏరకంగా దిగజారిపోయిందో అర్థం అవుతుందని అన్నారు. అందరం హిందువులమే అయినప్పుడు ఆ ఫొటో ఒక్క బీజేపీ నేతలకే మనోభావాలు దెబ్బతిన్నాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
ఏపీలో మత రాజకీయాలు చెల్లవు
చంద్రబాబు హయాంలో 40 ఆలయాలను కూల్చివేస్తే బీజేపీ ఏం చేశారని వెల్లంపల్లి నిలదీశారు. చంద్రబాబు కూల్చిన ఆలయాలను పునర్నిర్మిస్తున్నామని ఆయన స్పష్టంచేశారు. బీజేపీ మత రాజకీయాలు ఏపీ చెల్లవని అన్నారు. శివాలయాల వద్ద బీజేపీ డ్రామాలను ప్రజలు నమ్మరని విమర్శించారు. ఏపీలో పాలన అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు.
అసలేమైంది?
మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ వైఎస్ఆర్సీపీ ఒక ట్వీట్ చేసింది. ఇందులో చిన్న పిల్లాడికి ఏపీ సీఎం జగన్ పాలు తాగిస్తున్నట్లుగా ఉన్న గ్రాఫిక్ పిక్ను షేర్ చేసింది. అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వర ఆరాధన. ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ ఫొటోలో ఉన్న బాలుడు శివుని తరహాలో పులి చర్మం ధరించి, చేతిలో ఢమరుకం, నామాలతో ఉండటాన్ని ఏపీ బీజేపీ నేతలు తప్పుబట్టారు. హిందువుల మనోభావాల పట్ల వైఎస్ఆర్ ప్రభుత్వం చులకన భావానికి ఇది ప్రతీక అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. హైందవ సమాజానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా బీజేపీ చేస్తున్న విమర్శలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చింది. ప్రపంచంలో అనువణువునా శివుడే కొలువై ఉన్నాడు. మంచి అన్నది ప్రతీది దైవమే. అదే శివతత్వం. ఇందులో శివుడిని అవమానించడం ఎక్కడో జరిగిందో ఆ పరమాత్ముడికే ఎరుక అంటూ సెటైర్ వేస్తూ మరో ట్వీట్ చేసింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
BRS MLA Sayanna | బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత..
Viral News | ఎద్దుతో యువకుడికి ఘనంగా పెళ్లి.. అనకాపల్లిలో వింత ఆచారం
Nandamuri Tarakaratna | తారకరత్న కన్నుమూత.. 23 రోజులు ప్రాణాలతో పోరాడి ఓడిన నందమూరి వారసుడు