Tollywood 2022 | ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీకి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. కృష్ణ, కృష్ణంరాజు వంటి ఎంతోమంది సీనియర్ నటులను టాలీవుడ్ కోల్పోయింది. ఒకరి తర్వాత మరొకరు అన్నట్టు లెజెండరీ నటులు ఈ లోకం విడిచివెళ్లిపోయారు. ఈ ఏడాది జనవరి నుంచే మొదలైన ఈ విషాదాలు నిన్నటి చలపతిరావు మృతి దాకా కంటిన్యూ అవుతూనే వచ్చాయి. మరి 2022లో మరణించిన సెలబ్రెటీలు ఎవరో ఒకసారి గుర్తు చేసుకుందాం..
కృష్ణ తనయుడు రమేశ్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు అనారోగ్యంతో ఈ ఏడాది జనవరి 8న కన్నుమూశాడు. ఈ బాధతోనే ఇందిరాదేవి, కృష్ణ ఇద్దరూ కొద్దిరోజుల్లోనే లోకాన్ని విడిచివెళ్లారు. ఈ ముగ్గురి మరణాలు మహేశ్ బాబును తీవ్ర విషాదంలోకి నెట్టేశాయి. ముఖ్యంగా రమేశ్ బాబు మరణించినప్పుడు కరోనా సోకడంతో అన్నయ్య చివరిచూపునకు కూడా మహేశ్ నోచుకోలేకపోయాడు.
కందికొండ యాదగిరి
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో పాటలు రాసిన గేయ రచయిత కందికొండ యాదగిరి ఈ ఏడాది మార్చి 12న మరణించాడు. గొంతు క్యాన్సర్కు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. అదే రోజు ప్రముఖ సంగీత దర్శకుడు కోదండపాని తనయుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ రావు కూడా అనారోగ్యంతో కన్నుమూశాడు.
డైరెక్టర్ శరత్
వంశానికొక్కడు, పెద్దన్నయ్య, వంశోద్దారకుడు, బావాబామ్మర్ది, పెద్దింటి అల్లుడు వంటి సూపర్ హిట్ చిత్రాలు తీసిన డైరెక్టర్ శరత్ కూడా ఈ ఏడాదిలోనే మరణించాడు. అనారోగ్య కారణంతో ఏప్రిల్ 1న శరత్ మృతిచెందాడు.
సీనియర్ నటుడు బాలయ్య
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రతిభ చాటిన సీనియర్ నటుడు బాలయ్య ఏప్రిల్ 9న కన్నుమూశాడు. 1958లో సినీ ఇండస్ట్రీకి వచ్చిన బాలయ్య.. ఐదున్నర దశాబ్దాల పాటు సేవలందించాడు. 300కిపైగా సినిమాల్లో నటించాడు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి నటులతో సూపర్ హిట్ చిత్రాలు తీసిన దర్శకుడు తాతినేని రామారావు ఏప్రిల్ 20న కన్నుమూశాడు.
రెబల్ స్టార్ కృష్ణం రాజు
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి రెబల్ స్టార్గా పేరు తెచ్చుకున్న కృష్ణం రాజు ఈ ఏడాదిలోనే లోకాన్ని విడిచి వెళ్లాడు. అనారోగ్యంతో సెప్టెంబర్ 11న ఆయన కన్నుమూశాడు. 1966లో చిలకా గోరింక సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన కృష్ణంరాజు.. ఐదున్నర దశాబ్దాల్లో 183 సినిమాల్లో నటించాడు. చివరగా 2022లో వచ్చిన రాధేశ్యామ్ సినిమాలో కనిపించాడు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కృష్ణం రాజు సేవలందించాడు. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.
సూపర్స్టార్ కృష్ణ
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన కొద్దిరోజులకే సూపర్ స్టార్ కృష్ణ కూడా కన్నుమూశాడు. ఇదే ఏడాదిలో కొడుకు, భార్యను కోల్పోవడంతో ఆయన మానసికంగా ఎంతగానో కుంగిపోయాడు. ఆ దిగులుతోనే గుండెపోటుతో మరణించాడు. 1965లో తేనె మనసులు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన కృష్ణ.. ఆంధ్రా జేమ్స్బాండ్గా పేరుపొందాడు. సాహసాలకు కేరాఫ్ అడ్రస్గా మారాడు. తెలుగు ఇండస్ట్రీకి అప్పటివరకు పరిచయం లేని గూఢచారి, కౌబాయ్ చిత్రాలను అందించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త టెక్నాలజీని కూడా ఆయనే పరిచయం చేశాడు. తన కెరీర్లో సుమారు 360 చిత్రాల్లో నటించాడు. 2009లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్తో సత్కరించింది.
కైకాల సత్యనారాయణ
తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయిన లెజండరీ నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల.. ఫిలింనగర్లోని తన నివాసంలో డిసెంబర్ 23న తుదిశ్వాస విడిచాడు. 1959లో సిపాయి కూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత డైరెక్టర్ విఠలాచార్య సూచనతో విలన్గా మారాడు. చాలా ఏళ్లపాటు ఇండస్ట్రీలో నంబర్వన్ విలన్గా కొనసాగాడు. ఆ తర్వాత కమెడియన్గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్లో నటించి మెప్పించాడు. తన 60 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా యమగోల సినిమాలో ఆయన వేసిన యముడి పాత్ర చిరస్థాయిగా గుర్తుండిపోతుంది.
చలపతిరావు
కైకాల మరణించిన రెండో రోజే చలపతిరావు మరణించడం ఇండస్ట్రీని తీవ్ర విషాదంలోకి నెట్టింది. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 1200కి పైగా చిత్రాల్లో నటించిన చలపతిరావు డిసెంబర్ 24న రాత్రి గుండెపోటుతో మరణించాడు.
Read More Articles |
Disaster movies of 2022 | ఈ ఏడాది టాలీవుడ్లో అత్యంత డిజాస్టర్ అయిన మూవీస్ ఇవే..
chalapathi rao | చలపతిరావు అంటే హీరోయిన్స్కు భయం.. ఆయన ఉన్న హోటల్కు అస్సలు వెళ్లేవాళ్లు కాదు
chalapathi rao | చలపతిరావు జీవితంలో సినిమాటిక్ లవ్ స్టోరీ.. అమ్మాయిని చూసిన వారం రోజుల్లోనే పెళ్లి