Mayilsamy | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. నందమూరి తారకరత్న మరణించిన కొద్దిగంటల్లోనే మరో నటుడు కన్నుమూశాడు. ప్రముఖ తమిళ హాస్య నటుడు మయిల్ స్వామి (57) అనారోగ్యంతో మరణించాడు. ఆదివారం తెల్లవారుజామున మయిల్స్వామి అస్వస్థతకు గురికావడంతో అతని కుటుంబసభ్యులు పోరూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి వెళ్లేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసి కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మయిల్ స్వామి 1984లో కమెడియన్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నాలుగు దశాబ్దాల కెరీర్లో మయిల్ స్వామి దాదాపు 200 సినిమాల్లో నటించాడు. కాంచన, కాంచన 2, పందెంకోడి 2, రోబో2.0, రెమో వంటి పలు డబ్బింగ్ చిత్రాలతో కూడా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. మయిల్ స్వామి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా మయిల్ స్వామి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.