Gautam Adani | వ్యాపార రంగంలో ఆకాశమే హద్దుగా.. వెనుతిరిగి చూడని వ్యాపారవేత్తగా అదానీ దూసుకెళ్లాడు. అలాంటి అదానీకి హిండెన్బర్గ్ షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్లోని లొసుగులన్నింటినీ ఒక్కసారిగా బయటపెట్టింది. ఆ సంస్థ వేసిన 88 ప్రశ్నలకు అదానీ గ్రూప్ నుంచి ఎటువంటి సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
దాంతో అదానీ గ్రూప్లోని షేర్లు భారీగా పతనం అవటమే కాదు… కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఏడు లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఆవిరైన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో అదానీ ఎంటర్ ప్రైజెస్ రూ.20 వేల కోట్ల నిధుల సమీకరణ కోసం చేపట్టిన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ( FPO ) గట్టెక్కుతుందా? అన్న సందేహాలు కలిగాయి.
సాధారణ రోజుల్లో అయితే అదానీ కోరుకున్న దానికి రెట్టింపు మొత్తం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ… ఇలాంటి సందర్భాల్లో అదానీ FPOకు స్పందన వస్తుందా అన్న అనుమానాలు తలెత్తాయి. గండం నుంచి అదానీ బయటపడతాడా అనుకున్నారు. కానీ అదానీని గట్టెక్కించేందుకు ఇద్దరు మిత్రులు ముందుకు వచ్చినట్లుగా సమాచారం.
దీనికి సంబంధించిన వివరాల్ని బ్లూమ్ బర్గ్ సంస్థ తాజాగా బయటపెట్టింది. కష్టాల్లో ఉన్న స్నేహితున్ని ఆదుకున్న ముగ్గురు ఫ్రెండ్స్ కి సంబంధించిన వివరాల్ని… వారు ఏ మేర సాయం చేశారన్న విషయాన్ని ఈ సంస్థ తన కథనంలో వెల్లడించింది. అదానీ కంపెనీల షేర్లు నేలచూపులు చూస్తూ.. నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ ఎఫ్ పీవోలకు సానుకూల స్పందన వెనుక ఇద్దరు భారతీయ వ్యాపారవేత్తలు ఉన్న విషయాన్ని పేర్కొంది. వారిలో ఒకరు భారతీ ఎయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్ కాగా.. మరొకరు జేఎస్ డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ గా పేర్కొన్నారు.
వీరిద్దరు FPOలో భారీగా పెట్టుబడులు పెట్టారని.. అయితే తమ వివరాలు బయటకు రాకూడదని పేర్కొన్నట్లుగా సమాచారం. కానీ బ్లూమ్ బర్గ్ పుణ్యమా అని ఆ వివరాలు బయటకు వచ్చేశాయి. ఎయిర్ టెల్ సునీల్ మిత్తల్ ఎంత మొత్తానికి సబ్ స్క్రైబ్ చేశారన్న వివరాలు బయటకు రానప్పటికీ.. జిందాల్ మాత్రం 30 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు సబ్ స్క్రైబ్ చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. వీరిద్దరితో పాటు అబుదాబి రాజకుటుంబానికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ సంస్థ ఐహెచ్ సీ 400 మిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టినట్లు చెబుతున్నారు. ఎఫ్ పీవో పెట్టుబడుల్లో ఇదే అతి పెద్ద పెట్టుబడిగా చెబుతున్నారు.
ఎఫ్ పీవో కోసం అదానీ ఎంటర్ ప్రైజస్ మొత్తం 4.55 కోట్ల షేర్లు అమ్మకానికి పెట్టగా ఈ ముగ్గురు మిత్రుల కారణంగా 4.62కోట్లకు బిడ్లు దాఖలైనట్లుగా చెబుతున్నారు. అదానీని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఈ ముగ్గురిలో.. దేశానికి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు మాత్రం తాము పెట్టిన పెట్టుబడులను తమ వ్యక్తిగత సంపద నుంచి పెట్టినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Gautam Adani | ఎఫ్పీఓ ఉపసంహరణపై గౌతమ్ అదానీ కీలక ప్రకటన.. షాక్లో పెట్టుబడి దారులు
Hindenburg Report | హిండెన్బర్గ్ ఎఫెక్ట్.. బిలియనీర్స్ టాప్ 10లో చోటు కోల్పోయిన అదానీ
Google | షాక్ ఇచ్చిన సెర్చింజిన్ సంస్థ..12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన!