Metro Wholesale | మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియాను ముకేశ్ అంబానీ చేజిక్కించుకున్నాడు. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ భారత్లో 2003లో మెట్రో ఇండియాను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 31 హోల్ సేల్ దుకాణాలు ఉన్నాయి. రిటైల్ రంగంలో మరింత బలోపేతమయ్యేందుకు గాను ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ భారీ మొత్తం వెచ్చించి మెట్రోను చేజిక్కించుకుంది.
దాదాపు రూ. 2,850 కోట్లకు మెట్రో ఇండియాను కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ప్రకటించింది. ఈ మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించేందుకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం మెట్రో ఇండియాలో 3,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న రిటైలర్లతో మెట్రో వ్యాపారం నిర్వహిస్తోంది. దాదాపు 3 మిలియన్ల కస్టమర్లకు ఇప్పటివరకు సేవలు అందించగా వీరిలో 10 లక్షల మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్లోని మూసాపేట్, రాజేంద్రనగర్, ఉప్పల్, సుచిత్ర సర్కిల్ సమీపంలో మెట్రో క్యాష్ అండ్ క్యారీ హోల్ సేల్ దుకాణాలు ఉన్నాయి. ఇప్పుడివి రిలయన్స్ చేతిలోకి వెళ్లాయి. అలాగే దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 31 స్టోర్లు ఉన్నాయి.
Read More Articles |
Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?