Gautam Adani | టైం2న్యూస్, న్యూదిల్లీ: తన ఇన్వెస్టర్ల ఆసక్తే తనకు అత్యంత ముఖ్యమని, మిగతావన్నీ ఆ తర్వాతే అని ప్రపంచ అపరకుబేరుడు గౌతమ్ అదానీ (Gautam Adani) అన్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్(Adani Enterprises) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(FPO)ను రద్దు చేసుకుంటున్నట్లు, సేకరించిన రూ.20వేల కోట్లను తిరిగి పెట్టుబడిదారులకు ఇచ్చేయనున్నట్లు అదానీ గ్రూప్(Adani Group) బుధవారం రాత్రి అనూహ్య నిర్ణయం తీసుకుంది.
మార్కెట్లో అస్థిరత నేపథ్యంలో ఎఫ్పీఓ(FPO)ను రద్దు చేస్తున్నట్లు ఎక్స్చేంజీలకు తెలిపింది. ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. దీంతో మార్కెట్ వర్గాలు, పెట్టుబడిదారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసి ఉండవచ్చని, అయితే మార్కెట్లో చోటు చేసుకున్న అస్థిరత నేపథ్యంలోనే ఎఫ్పీఓతో ముందుకు సాగడం నైతికంగా సరైనది కాదని బోర్డు భావించినట్లు గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘ఒక పారిశ్రామికవేత్తగా నాలుగు దశాబ్దాల గొప్ప ప్రయాణంలో అన్నిరకాల ఇన్వెస్టర్ల నుంచి గొప్ప మద్దతు పొందాను. నా జీవితంలో ఏ చిన్నది సాధించినా అది వారి విశ్వాసం, నమ్మకం ద్వారానే వచ్చిందని అంగీకరించడం నాకు చాలా ముఖ్యం. నా విజయం పట్ల వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. నా ఇన్వెస్టర్ల ఆసక్తే నాకు అత్యంత ప్రాధాన్యం. దాని తర్వాతే ఏదైనా. ఈ సమయంలో మా గ్రూప్ పెట్టుబడిదారులను రక్షించడానికి ఎఫ్పీఓ ఉపసంహరించుకుంటున్నాము’’ అని అదానీ పేర్కొన్నారు.
రూ.20 వేల కోట్ల నిధుల కోసం అదానీ గ్రూప్నకు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ జనవరి 27 నుంచి 31 వరకు మలి విడత పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీఓ) ప్రకటించింది. అయితే అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్బర్గ్ రిసెర్చ్ ( Hindenburg research ) జనవరి 24న బాంబు పేల్చింది. ఈ ఆరోపణలతో భారత స్టాక్ మార్కెట్లు పేకమేడలా కూలాయి. ఈ దెబ్బకు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు సుమారు రూ.నాలుగున్నర లక్షల కోట్లు నష్టపోయాయి. రూ.10 లక్షల కోట్ల మదుపర్ల సంపద మూడు రోజుల్లోనే ఆవిరైపోయింది. అదానీ గ్రూప్ షేర్లు భారీ ఎత్తున నష్టాలను చవిచూశాయి.
అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 28 శాతం పడిపోయాయి. ఈ అనుమానాల నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్కు వచ్చిన అదానీ ఎంటర్ప్రైజెస్ను పెట్టుబడిదారులు పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అయితే అనూహ్యంగా గత రాత్రి భేటీ అయిన అదానీ గ్రూప్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కాపాడేందుకు, ఎఫ్పీఓ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సేకరించిన నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించనున్నట్లు తెలిపింది. మార్కెట్ స్థిరత్వానికి వచ్చాక బోర్డు మళ్లీ క్యాపిటల్ మార్కెట్ వ్యూహాన్ని పరిశీలిస్తుందని తెలిపింది.
‘‘ఎఫ్పీఓ ఉపసంహరణ నిర్ణయం ప్రస్తుత, భవిష్యత్లో మా కార్యకలపాలపై ఎలాంటి ప్రభావం చూపించదు. ప్రస్తుతమున్న ప్రాజెక్టు డెలివరీలపై మా దృష్టిని అలాగే కొనసాగిస్తాం. మా కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి. మా బ్యాలెన్స్ షీట్, ఆస్తులు పటిష్టంగా ఉన్నాయి. కంపెనీ లాభాలు, నగదు లభ్యత దృఢంగా ఉంది. రుణాలను తీర్చడంలో మాకు ఎంతో ట్రాక్ రికార్డ్ ఉంది. దీర్ఘకాలిక విలువ సృష్టి, రాబడులపైనే ఎల్లప్పుడు మా దృష్టి ఉంటుంది’’ అని అదానీ పేర్కొన్నారు.
‘‘ మా ప్రతి బిజినెస్లో సంపద సృష్టి బాధ్యతాయుతంగా ఉండేవిధంగా దృష్టి సారిస్తాం. అంతర్జాతీయ స్థాయిలో పలు సంస్థలతో మా కంపెనీ భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడం వల్లే కంపెనీ పాలన సూత్రాలు చాలా బలంగా ఉన్నాయి. మా ఎఫ్పీఓకు మద్దతు ఇచ్చిన మా పెట్టుబడిదారులకు, సంస్థాగత మదుపర్లకు, వాటాదార్లకు ధన్యవాదాలు’’ అని అదానీ తెలిపారు.
మరోవైపు రూ.20 వేల కోట్ల నిధుల సేకరణకు ప్రారంభించిన ఎఫ్పీఓకు సానుకూల స్పందన రావడం వెనక ఇద్దరు భారతీయ పారిశ్రామిక దిగ్గజాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. అదానీ షేర్లను వారు సబ్స్క్రైబ్ చేసుకోవడంతోనే ఈ ఎఫ్పీఓ విజయవంతమైనట్లు తెలుస్తోంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Hindenburg Report | హిండెన్బర్గ్ ఎఫెక్ట్.. బిలియనీర్స్ టాప్ 10లో చోటు కోల్పోయిన అదానీ
Google | షాక్ ఇచ్చిన సెర్చింజిన్ సంస్థ..12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన!