KCR on Adani | అదానీ అంత వేగంగా ఎలా ఎదిగారో చెప్పాలని మోదీ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. నాందేడ్ సభ తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. పేదలను దోచి కొద్ది మంది మిత్రులకు లాభం చేకూర్చడమే మోదీ విధానమని తీవ్ర స్తాయిలో విమర్శించారు.
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీతో అదానీ సంస్థల్లో రూ.87 వేల కోట్లు పెట్టుబడులు పెట్టించారని మోదీ సర్కారుపై కేసీఆర్ మండిపడ్డారు. అదానీ దెబ్బకు వారంలో రూ. 10 లక్షల కోట్ల సంపద ఆవిరైందన్న కేసీఆర్.. అదానీ స్కామ్పై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయడం లేదని నిలదీశారు. పార్లమెంట్లో దీనిపై సమాధానం ఎందుకు చెప్పట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతజరిగినా ఎల్ఐసీకి నష్టం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీ మిత్రుడు కాబట్టే అదానీని కాపాడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు.
అదానీ రంగు ఇప్పడిప్పుడే బయటపడుతోంది
దేశానికి సరిపడా బొగ్గు నిల్వలు మన దగ్గరే ఉన్నాయని, కిలో బొగ్గును కూడా దేశం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. అయితే విదేశాల నుంచి బొగ్గును ఎందుకు కొనాల్సి వస్తోందో సమాధానం చెప్పాలన్నారు. కోల్మైన్స్ ఉన్న ప్రాంతాలకు కావాలనే కొత్త రైల్వే లైన్లు మంజూరు చేయడం లేదని కేసీఆర్ ఆరోపించారు. అదానీపై ఉన్న ప్రేమ దేశ ప్రజలపై ఉండాలి కదా అన్నారు. ఇప్పుడిప్పుడే అదానీ అసలు రంగు బయటపడుతోందన్న కేసీఆర్.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది పెనుముప్పు అని అన్నారు.
అధికారంలోకి వస్తే దేశంలో కరెంట్ కోతలుండవు
విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయొద్దన్న కేసీఆర్.. ఒకవేళ చేసినా తాము అధికారంలోకి వచ్చాక జాతీయం చేస్తామన్నారు. విద్యుత్ రంగం విషయంలో కేంద్రం అదానీ, అంబానీ, జిందాల్ పాట పాడుంతోందని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని, కొన్ని రాష్ట్రాల్లో కేవలం 3 గంటలు కూడా కరెంట్ ఉండటం లేదన్నారు. విద్యుత్ వినియోగం అనేది అభివృద్ధి ఇండెక్స్కి ప్రమాణికం అని, ఇందులో భారత్ పరిస్థితి ఎందుకు మారడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో భారత్లో కరెంట్ కోతలుండవిని అన్నారు. భారత్ను వెలిగిపోయేలా చేస్తాం అన్నారు.
ఎన్నికల సంస్కరణలు చేపడతాం
కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎన్నికల సంస్కరణలు చేపడుతుందని చెప్పారు.
బీజేపీ మతతత్వ రాజకీయాలపై పోరాటం కొనసాగిస్తామన్న కేసీఆర్.. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయని, దీని వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని విమర్శించారు. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. చైనా నుంచి కంపెనీలు తరలిపోతున్నా.. భారత్కు ఎందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు.
మహారాష్ట్రకు నీళ్లిచ్చేందుకు సిద్ధం
బాబ్లీ పేరుతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలతో డ్రామాలు ఆడారని కేసీఆర్ అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో వివాదమే లేదన్న ఆయన.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకా వివాదం ఎక్కడిదన్నారు. మహారాష్ట్ర సహకారంతోనే కాళేశ్వరం పూర్తయిందన్నారు. మహారాష్ట్రకు హృదయపూర్వకంగా ఉంటామని, అవసరమైతే శ్రీరాంసాగర్ నుంచి నీళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. లిఫ్టుల ద్వారా నీళ్లు కావాలంటే తీసుకోవచ్చాన్నారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామని ప్రకటించారు. మహిళల కోసం కొత్త పాలసీ తీసుకొస్తామని చెప్పారు. అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం మాటలకే పరిమితమైందని విమర్శించారు. మహిళలకు రక్షణ లేదనడానికి హథ్రాస్ ఘటనే నిదర్శనమన్నారు.
హైదరాబాద్ పవర్ ఐలాండ్..
తెలంగాణ వచ్చిన కొద్దిరోజులకే హైదరాబాద్ను పవర్ ఐలాండ్గా మార్చామని కేసీఆర్ చెప్పారు. న్యూయార్క్లో కరెంట్ పోయినా హైదరాబాద్లో కరెంట్ పోదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో రెండేళ్లలో కరెంట్ పోకుండా చూస్తామని ప్రకటించారు.
చైనాతో ఇంకెప్పుడు పోటీ పడతాం
భారత్లో గూడ్స్ రైలు స్పీడు గంటకు 24 కిలోమీటర్లు అని, అదే చైనాలో 120 కిలోమీటర్ల వేగంతో వెళుతుంటాయని అన్నారు. ఇట్లాగే ఉంటే ఇంకెప్పుడు మనం చైనాతో పోటీపడతామని ప్రశ్నించారు. అసలు సాధ్యమవుతుందా అని నిలదీశారు. అందుకే దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో రోడ్లు, రైళ్లు, షిప్ యార్డులు, ఎయిర్పోర్టులు ఏవీ సరిగా ఉండవని ఆరోపించారు. భారత్లో ట్రక్కులు 50కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంటే.. జపాన్లొ 60, దక్షిణ కొరియాలొ 80, అమెరికాలో 115 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంటాయన్నారు. ఎప్ప్డు మనం విదేశాలతో పోటీపడతామని ప్రశ్నించారు. అభివృద్దికి బదులు ధర్మం, జాతీయవాదం పేరు చెప్పుకుంటూ ప్రజల్ని విభజిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.
రైతుల ఆత్మహత్యలు దేశానికి సిగ్గు చేటు..
ప్రపంచవ్యాప్తంగా వేల టీఎంసీల ప్రాజెక్టులు ఉన్నాయని, మన దేశానికి అలాంటి ప్రాజెక్టులు అవసరం లేదా అని ప్రశ్నించారు. 75 ఏళ్లుగా దేశంలో రైతుల పరిస్థితి ఏం మారలేదని, రైతుల ఆత్మహత్యలు కూడా ఆగడం లేదన్నారు. అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకుంటున్నప్పటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దేశానికి సిగ్గుచేటన్నారు.
జలవిధానంలో మార్పులు చేస్తాం
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో ప్రస్తుతం ఉన్న జల విధానంలో విప్లవాత్మక మార్పులు చేస్తామని కేసీఆర్ చెప్పారు. దేశంలో అవసరానికి మించి జల సంపద ఉన్నా వినియోగించుకోలేకపోతుందన్నారు. నీళ్ల కోసం రాష్ట్రాల మధ్య ఎన్నాళ్లు యుద్ధాలు జరుగుతాయని ప్రశ్నించారు. భారత్ కంటే చిన్న దేశాలైన సింగపూర్, జపాన్, మలేషియా, దక్షిణ కొరియా అభివృద్ధిలో దూసుకెళుతున్నాయన్నారు. రోటిన్కు భిన్నంగా వెళితేనే ఇలాంటివి సాధ్యమన్నారు. నీటి కొట్లాటలపై మేధావులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. దేశంలో అవసరానికి మించి నీటి వనరులు ఉన్నాయని కేంద్ర జలశక్తి చెప్పిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.