Supreme court | అతి తెలివితో ఓ యువకుడు చేసిన పని అతనికే బెడిసికొట్టింది. యూట్యూబ్లో యాడ్స్ చూడటం వల్లే పోటీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని ఆరోపించి.. డబ్బులు కొట్టేయాలని ప్రయత్నించిన అతనికి సుప్రీంకోర్టు గట్టిగా మొట్టికాయలు వేసింది.75 లక్షలు కొట్టేయాలని భావించిన అతనికి రివర్స్లో 25వేల జరిమానాను విధించింది. వివరాల్లోకి వెళ్తే
మధ్యప్రదేశ్కు చెందిన ఆనంద్ కిశోర్ అనే యువకుడు పోలీసు పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ఇందుకోసం యూట్యూబ్లో ఓ ఛానల్లో వచ్చే వీడియోలను ఫాలో అవుతున్నాడు. అయితే ఆ వీడియోలు చూసేటప్పుడు వచ్చిన అశ్లీల యాడ్స్ చూసి డైవర్ట్ అయ్యాడు. ఆ యాప్స్లో సమయాన్ని గడుపుతూ ఎగ్జామ్స్కు సరిగ్గా ప్రిపేర్ కాలేదు. దీనివల్ల సరిగ్గా ఎగ్జామ్ రాయలేకపోయినట్టు సదరు యువకుడు భావించాడు. దీంతో తన దృష్టిని మరల్చేలా యాడ్స్ చూపించారని యూట్యూబ్పై సుప్రీంకోర్టులో కేసు వేశాడు. యూట్యూబ్ నుంచి రూ.75 లక్షల నష్టపరిహారాన్ని అందించాలని పిటిషన్లో కోరాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఈ పిటిషన్ దాఖలు చేశాడు. అంతేకాదు సోషల్ మీడియాలో అశ్లీలతను నిషేధించాలని కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నాడు.
పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం యువకుడికి మొట్టికాయలు వేసింది. ఆర్టికల్ 32 కింద దాఖలు అయిన అత్యంత దారుణమైన పిటిషన్లలో ఇది ఒకటి అని ధర్మాసనం అభిప్రాయపడింది.యాడ్స్ చూస్తూ పోటీ పరీక్షల ప్రిపరేషన్పై ఆసక్తి తగ్గిపోయిందని ఆరోపించడం సరికాదని తెలిపింది. అయినా యాడ్స్ చూడమని మీకు ఎవరూ చెప్పలేదు కదా అని ప్రశ్నించింది. ఇటువంటి పిటిషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృథా చేసినందుకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఊహించని తీర్పుతో షాకైన సదరు పిటిషనర్.. తాను ఒక నిరుద్యోగిని అని అంత చెల్లించాలని రిక్వెస్ట్ చేసుకున్నాడు. దీంతో జరిమానాను లక్ష నుంచి రూ.25వేలకు తగ్గించింది.
Read More Articles |
cyclone mandous | తీరం దాటిన తుఫాన్..ఈ ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు